ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఊరూరా ఫ్రీడం కప్ క్రీడలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, విజేతలకు పండుగ వాతావరణంలో బహుమతులు అందించారు. పలుచోట్ల భారీ త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు తీసి దేశభక్తిని చాటుకున్నారు. హసన్పర్తిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో 40 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ములుగులో 600 మీటర్లు, మంగపేటలో 75 మీటర్ల పొడవైన జాతీయ పతాకాలతో తీసిన భారీ ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా ‘ఫ్రీడం కప్’ క్రీడలు
నమస్తే నెట్వర్క్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ సంబురాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. భూపాలపల్లిలోని సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో ఆటల పోటీల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరై, క్యారమ్స్, చెస్ ఆడారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర పాల్గొన్నారు. జనగామలో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య బహుమతులు అందజేశారు. మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్లకు కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ హాజరై, క్రీడాకారులతో కలిసి కాసేపు ఆటలాడారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులకు క్రీడలు నిర్వహించారు. వేయిస్తంభాల గుడి నుంచి పబ్లిక్గార్డెన్ వరకు ఫార్మసీ విద్యార్థులు తీసిన ర్యాలీని హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్ ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్ అధ్యక్షతన ఫ్రీడం కప్ క్రీడా పోటీలు నిర్వహించగా, ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ఖాన్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన వారిని షీల్డ్స్, మెడల్స్తో సత్కరించారు.
కాజీపేట డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో రెడ్క్రాస్ సహకారంతో హసన్పర్తిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, సీపీ తరుణ్ జోషి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులు, యువకులకు సర్టిఫికెట్లు, పండ్లను పంపిణీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కాజీపేటలో నిర్వహించిన ఫ్రీడం క్రికెట్ కప్ పోటీల్లో హెడ్ క్వార్టర్స్ టీం విజేతగా నిలిచింది. విన్నర్స్, రన్నర్గా నిలిచిన టీంలకు సీపీ షీల్డ్స్ అందజేశారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో 40 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ బీ హరిసింగ్, వందే మాతరం ఫౌండేషన్ డైరెక్టర్ టీ రవీందర్రావు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో 600 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీయగా, ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రారంభించారు. సుమారు 2 వేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. జిల్లా ఉపాధ్యాయులకు ‘భారతీయ ఏకత్వం-ఖ్యాతి’ అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించగా, 20 మంది ఉపాధ్యాయులు కవితలను చదివి వినిపించారు. డీఈవో పాణిని విజేతలకు ప్రశంసా పత్రాలు అందించారు. మంగపేట మండలం రాజుపేటలో 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీశారు.