జనగామ, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది, వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం అన్నారు. ఆదివారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు’ అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట జనగామ జిల్లాకేంద్రంలోని ఎస్ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జనగామ ఏబీవీ జూనియర్ కాలేజీ, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. 500మందికి పైగా విద్యార్థులు హాజరైన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత ఏయే కోర్సులు చదవాలి? ఎటువైపు వెళ్తే జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశాలపై కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సహా ఏబీవీ జూనియర్ కాలేజీ, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు కనకరాజు, శ్రీనివాసులు దిశానిర్దేశం చేశారు.
పోటీ ప్రపంచంలో ముందస్తు ప్రణాళిక ఎంతో ముఖ్యమని అందుకోసం ఆత్మవిశ్వాసంతో ఎదగాలని, ఉజ్వల భవిష్యత్తుకు.. డ్యుయల్ డిగ్రీ పునాది అవుతుందని ప్రొఫెసర్ ఎంపీ మల్లేశం అన్నారు. ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగావకాశాలు కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకే సాధ్యమని, డిగ్రీ నాలుగేండ్లు కష్టపడి చదివితే.. 40 ఏండ్లు మంచి జీవితం అనుభవించవచ్చన్నారు. కేఎల్యూలో ఒకేసారి రెండు కోర్సులు చదివే అవకాశం ఉండడంతో పాటు విద్యార్థులకు ఐదు ఫారెన్ లాంగ్వేజీలపై ఉచిత శిక్షణ ఇస్తారని, ఆన్లైన్, ఆఫ్లైన్లో జేఈఈ బేసిక్ ఎగ్జామ్ నిర్వహిస్తారని చెప్పారు. జేయూఈఈలో 95శాతం పర్సంటైల్ సాధించిన వారికి కేఎల్ యూనివర్సిటీలో ఉచితంగా సీటు కేటాయిస్తుందన్నారు. మెరిట్ విద్యార్థులకు తమ యూనివర్సిటీ రూ.100కోట్ల స్కాలర్షిప్లు అందిస్తూ తోడ్పడుతుందని చెప్పారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ(బీ.టెక్) చదివే విద్యార్థులు ఒకేసారి రెండు కోర్సులు పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. బీటెక్ చదువుతున్నప్పుడే వారి స్కిల్స్ను పరిగణనలోకి తీసుకొని ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు యూనివర్సిటీ అవకాశం కల్పిస్తుందని వివరించారు. రూ.60లక్షల వార్షిక ప్యాకేజీతో విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు.
దేశ, విదేశాల్లోనూ కేఎల్ యూనివర్సిటీకి 70 నుంచి 80 విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఉందని, వారితో సంప్రదింపులు జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. న్యాక్ గుర్తింపుతో నాలుగు మార్కులకు గాను కేఎల్ యూనివర్సిటీకి 3.86 మార్కులు వచ్చాయన్నారు. మైక్రోసాఫ్ట్, విప్రోతో పాటు పలు పెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక సిలబస్తో కూడిన పుస్తకాలను సంబంధిత అధికారుల సమక్షంలో తయారు చేస్తారని వివరించారు. 1983లో ఆరంభమైన కేఎల్ యూనివర్సిటీ 40 ఏండ్లుగా వేలాది మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించిందన్నారు. అనంతరం ఇంటర్ ఫస్టియర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంటర్ తర్వాత ఎటువైపు? అనే అంశంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడంతో ఏబీవీ, శ్రీగాయత్రి విద్యార్థులు నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ పీ అశోక్కుమార్, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ సూరి తదితరులు పాల్గొన్నారు.
ఎదగాలనే సంకల్పం బలంగా ఉన్నవారిని ఎవరూ ఆపలేరని ప్రొఫెసర్ ఎంపీ మల్లేశం అన్నారు. మీ లక్ష్యానికి కేఎల్ యూనివర్సిటీ గైడ్ తోడైతే గమ్యం మరింత సులభమవుతుందని చెప్పారు. భూమిలో వేసిన విత్తనాన్ని నాశనం చేసేందుకు పురుగులు, కీటకాలు ప్రయత్నిస్తుంటాయని, కానీ వాటన్నింటినీ అధిగమించి మొక్కగా ఎదుగుతుందన్నారు. ఆ తర్వాత మేకలు, గొర్రెలు తింటూ అడ్డుపడుతుంటాయని.. అయినా ఆటంకాలను తొలగించుకొని మహావృక్షంగా అవతరిస్తుందన్నారు. అలా మనం కూడా ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరికీ తెలివితేటలు ఉంటాయని వాటిని వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు.
జనగామ రూరల్ : ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక గోల్ ఉండాలి. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. వారి ఉన్నత చదువుల కోసం పట్టణాల్లో మాత్రమే గతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేంది. ఇప్పుడు మన జనగామకు రావడం సంతోషకరం. ఇక్కడి విద్యార్థులు భవిష్యత్లో ఏ కోర్సులు తీసుకోవాలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలుస్తాయి.
కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అవగాహన సదస్సు చాలా బాగుంది. ఇంటర్ తర్వాత మా భవిష్యత్ కోసం ఏ కోర్సులు తీసుకోవాలో అవగాహన కల్పించారు. చదివిన తర్వాత భవిష్యత్లో ఎలాంటి ప్యాకేజీలు వస్తాయనే వివరాలను తెలియజేశారు. ఈ అవకాశం రావడం నాకు ఆనందంగా ఉన్నది.
లక్ష్యం కోసం మార్గం దొరికింది. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఈ అవగాహన సదస్సు చక్కటి మార్గం. తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలో ఈ సదస్సు మాకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్లో ఏ విధంగా ముందుకుపోవాలో అవగాహన కల్పించారు.
మరికొద్ది రోజుల్లో పరీక్షలు రాయనున్న క్రమంలో విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాక, పై చదువుల కోసం ఏ కోర్సులో చేరాలో వంటి వివరాలను కేఎల్ యూనివర్సిటీ వారు అవగాహన కల్పించారు. ఇది ఉన్నత చదువులకు పునాది వంటిది. ప్రతి విద్యార్థి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ సదస్సు నిర్వహించడం చాలా సంతోషం. ప్రముఖ విద్యా నిపుణులు పలు విషయాలపై చక్కటి అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో మా భవిష్యత్ నిర్ణయించే విధంగా ఉంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, చదవాలి, చదివిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఏవిధంగా ఉంటాయో కేఎల్ యూనివర్సిటీ వారు వివరించారు.