పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 22: మహిళలు ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదగాలన్నాదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందుకనుగుణంగానే సీఎం కేసీఆర్ సం క్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల పరిధిలోని 900 మంది మహిళలకు మనవడు టీ కార్తీక్బాబుతో కలిసి శుక్రవారం మండల కేం ద్రంలో ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం బాగుంటుందన్నా రు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సామాజిక ఆర్థిక పరిస్థితులు తనకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో కుట్టుమిషన్ శిక్షణలో పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశామని ఎర్రబెల్లి వివరించారు. ఇందులో భాగంగా నియోజక వర్గంలో 10 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా భోజన, వసతి కల్పించి టైలరింగ్లో శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లను పంపిణీ చేశామని చెప్పారు. దీనికి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఈ నెల 28న తొర్రూరులో నిర్వహించే సమావేశంలో సంగెం టెక్స్టైల్స్ పార్కులో ఉద్యోగాలకు ఎంపిక ఉంటుందన్నారు.
కాంగ్రెస్ నేతలవి బోగస్ మాటలు
ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని, వారిని మహిళలు నమ్మొద్దని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గొప్ప పరిపాలకుడని, విజన్ ఉన్న నేత అని ఆయన కొనియాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తనను మూడు సార్లు గెలిపించి రాష్ట్ర మంత్రిని చేసిన పాలకుర్తి నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజక వర్గంలోని మహిళలు బీఆర్ఎస్కు అండగా ఉండాలని ఆయన కోరారు.
తాత ప్రేరణతోనే సేవా కార్యక్రమాలు
తాత ఎర్రబెల్లి దయాకర్రావు స్ఫూరిగా తాము సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మనవడు టీ కార్తీక్బాబు అన్నారు. మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. తాతకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజా సేవ ముఖ్యమన్నారు. నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారన్నారు. తాత స్ఫూర్తితో నియోజకవర్గ ప్రజలకు ఎంతో కొంత సేవ చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాత ఎర్రబెల్లికి అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ పంజా కల్పన, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, ఏపీడీ ఎండీ నూరొద్దీన్, చంద్రశేఖర్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.