వరంగల్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీటి నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. తుది దశలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తోంది. వీటితో పాటు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిని సంక్రాంతి కానుకగా లబ్ధిదారులకు కేటాయించేందుకు నిర్ణయించింది. జనవరి 15న డ్రా పద్ధతిన అర్హులకు కేటాయించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యం లో అధికారులు లక్ష్య సాధన కోసం రంగంలోకి దిగా రు. ముఖ్యంగా చివరి దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి రోజున డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పక్కా ఇల్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. గ్రామాల్లో ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లును రూ.5.04 లక్షలు వెచ్చించి నిర్మించేందుకు నిర్ణయించింది. మౌలిక వసతుల కోసం అదనంగా నిధులు వెచ్చిస్తోంది. టెండర్ల ప్రక్రియ ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు కేటాయిస్తోంది. నిర్మాణం పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం డ్రా పద్ధతిన అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాకు 5,456 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. పాలనాపరమైన అనుమతులు కూడా ఇవ్వడంతో ఇంజినీరింగ్ విభాగాల అధికారులు 3,787 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. వీటిలో 47 ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ దశలో ఉండగా 493 ఇండ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2,302 ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరగా 880 ఇండ్ల నిర్మా ణం పూర్తయింది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లనిర్మాణం కోసం రూ.114.33 కోట్లు వెచ్చించింది.
డ్రా పద్ధతిన కేటాయింపు
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం అర్హులైన పేదలకు డ్రా పద్ధతిన కేటాయిస్తోంది. ఇప్పటికే జిల్లాలో నిర్మాణం పూర్తయిన 880 డబుల్ బెడ్రూం ఇండ్లలో 393 ఇండ్లను అధికారులు లబ్ధిదారులకు కేటాయించారు. పర్వతగిరి మండలం లో 80, సంగెం మండలంలో 80, రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో 233 డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు జరిపారు. వరంగల్, సంగెం, గీసుగొండ, ఖిలావరంగల్, రాయపర్తి మండలాల్లో నిర్మాణం పూర్తి చేసుకుని రెడీగా ఉన్న 487 డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా పద్ధతిన లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు నిర్మాణ పనులు తుది దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ పనుల పురోగతిపై కొద్దిరోజుల క్రిం ఉన్నత స్థాయిలో సమీక్ష జరిగింది.
ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని, నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్ల మిగులు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డ్రా పద్ధతిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు జరగాలని స్పష్టం చేసింది. దీంతో జనవరి 15న జిల్లాలో సాధ్యమైనంతవరకు డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడంపై అధికారులు నజర్ పెట్టారు. ప్రధానంగా తుది దశలో ఉన్న 2,302 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులపై దృష్టి సారించారు. పురోగతిలో ఉన్న అన్ని డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు పనులు పూర్తి కావొచ్చిన ఇండ్ల నిర్మాణాన్ని సంక్రాంతి పండుగలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పనులు తుది దశకు చేరిన ఇండ్లను ఉన్నతాధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పనుల పురోగతి, ఇండ్ల కేటాయింపు ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్నారు. శనివారం జిల్లా కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్ మండలంలోని దూపకుంట వద్ద నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను డీఆర్డీవో ఎం సంపత్రావు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణం పూర్తి కావొచ్చిన ఇండ్ల మిగిలిన పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరికొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పరిశీలించిన ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో డబుల్ బెడ్రూం ఇండ్లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని, తుది దశలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను మరో కొద్ది రోజుల్లో పూర్తి చేసి సంక్రాంతి పండుగకు లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో వివిధ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు డబుల్ బెడ్రూం ఇండ్ల పనుల్లో నిమగ్నమయ్యారు.