మడికొండ, ఏప్రిల్ 16 : ‘నా రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి వంటి పెద్ద మోసకారిని చూడలేదు, నాలుగు సార్లు ఓడిపోయిన శ్రీహరి, ఒక్కసారి ఓడిన నన్ను విమర్శించేందుకు సిగ్గుండాలి. పార్టీ పేరు మీద, కార్యకర్తల కష్టం వల్ల గెలిచిన నువ్వు దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలి’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ చేశారు. ‘కేసీఆర్ అన్ని రకాల పదవులిచ్చి గౌరవం ఇస్తే మోసం చేశావు. త్వరలో నీ చరిత్ర మొత్తం బయట పెడతా’ అని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా మడికొండలో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని బిడ్డా ఇక కాసుకో.. ఇద్దరి మధ్య కబడ్డీ, కబడ్డే అంటూ కడియం తీరుపై నిప్పులు చెరిగారు.
‘కేసీఆర్ నీకు అన్ని విధాలా పదవులు ఇచ్చి గౌరవం ఇస్తే మోసం చేశావని, నీలా నేను వెన్నుపోటు పొడవలేదని గతంలో పదవి పోగానే పార్టీ మారింది నువ్వే కాదా’ అని ఎర్రబెల్లి విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమైన తర్వాత చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను పార్టీ మారానని చెప్పారు. బీజేపీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోతోందని, మేం పడగొట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తనను ఓడగొట్టుకున్న పాపానికి పాలకుర్తి ప్రజలు ఏడుస్తున్నారని, ఉద్యమ సమయంలో కూడా ఏడుసార్లు గెలిచిన చరిత్ర నాదని చెప్పారు. నువ్వు ఎకడ పుట్టినవ్.. ఎకడ పెరిగనవ్.. నీ కులం ఏంటి.. నీ జీవిత చరిత్ర మొత్తం త్వరలోనే బయటపెడతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదని, ఒక పథకం కూడా అమలు చేసే దిక్కు లేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పీడించి దోచుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం దివాలా తీసిందని, నా అనుభవంతో చెబుతున్నా రెండేళ్లలో ఆర్టీసీ దివాలా తీయడం ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, ఎవ్వరికీ భయపడవద్దని, అన్నింటికీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ మంత్రులు సీతక్క, కొండా సురేఖ పదవులకు కడియం శ్రీహరితో ప్రమాదం ఉన్నదని చెప్పారు. సమావేశంలో కార్యక్రమానికి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి, కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడియం శ్రీహరిపై మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. ‘బిడ్డా ఇక కాసుకో.. ఇద్దరి మధ్య కబడ్డీ, కబడ్డేనని, స్టేషన్ ఘన్పూర్లో నువ్వు చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ తొడ కొట్టి సవాల్ విసిరారు. విదేశాల్లో కడియం శ్రీహరి అక్రమ ఆస్తులకు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలని అన్నారు. ఇకడ దోచుకున్న డబ్బులతో మలేషియా, సింగపూర్లో అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. లొంగని వాళ్లను ఎన్కౌంటర్ చేయించిన దుర్మార్గుడు కడియం అంటూ ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్నప్పుడు డీఈవో బదిలీల్లో రూ.2 కోట్లు, లింగంపల్లి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వద్ద రూ.6 కోట్లు లంచం తీసుకున్నారని పేర్కొన్నారు. పేకాట ఆడుతూ దొరికితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టలేదా అంటూ ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉండి అమాయక పిల్లల పొట్టకొట్టి కోట్లు దోచుకున్న చరిత్ర కడియం శ్రీహరిదేనన్నారు. ఏడు పెద్ద చెరువులను నిర్మించానని, వ్యవసాయరంగానికి ఎకడపడితే అకడ నీరందించినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులను నీ పక్షాన చేరేందుకు లేనిపోని ఆశలు కల్పించావన్నారు. నేను మాదిగ బిడ్డను, కులం పేరు చెప్పుకునేందుకు సిగ్గుపడనని, నా నియోజకవర్గంలోనే ఎప్పటికీ ఉంటానన్నారు. నీలా జిత్తుల మారి నకలాగా పని చేయనని, ఊసరవెల్లి వేషాలు వేయనని, రానున్న ఎన్నికల్లో డప్పు కొట్టి ప్రచారం చేసి 7 నియోజకవర్గాల్లో నీ బండారం బయటపెడతామన్నారు. నిన్ను ఓడించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మాదిగ ప్రజలతో ఉప ఎన్నికల్లో నిన్ను పాతాళానికి తొకేస్తామని స్పష్టంచేశారు.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో వచ్చాను. మీ ఆదరాభిమానాలతో నన్ను పార్లమెంటుకు పంపిస్తే నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఒక కార్యకర్తలాగే పనిచేస్తా. వరంగల్ జిల్లా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వరంగల్ను ముందువరుసలో నిలబెట్టారు. అనేక మంది పార్టీని వదిలి వెళ్లిపోయినా పార్టీకి వెన్నుదన్నులా కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలాంటి వారు. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తా.
పార్లమెంట్ ఎన్నికలు దుర్మార్గులకు, మంచికి మధ్య జరిగే పోరాటంలో మంచి తప్పకుండా గెలుస్తుంది. రానున్న రోజులన్నీ మనవే. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ తప్పకుండా కూలదోస్తుంది. స్టేషన్ఘన్పూర్లో జరిగే అభివృద్ధిని చాలావరకు కడియం శ్రీహరి అడ్డుకున్నారు. బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రమే పార్టీ మారారు. కానీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్కే ఓటు వేస్తామని చెబుతున్నారు. నేను స్టేషన్ఘన్పూర్ బిడ్డనే.. జనగామ, స్టేషన్ఘన్పూర్ నాకు రెండు కళ్లు వంటివి. నియోజకవర్గంలో కడియం శ్రీహరి వల్ల ఇబ్బందులు తలెత్తితే వారికి అండగా నిలబడతా. రాజయ్య, నేను కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాం.