నర్సంపేట, జూలై 1 : నర్సంపేట నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శిం చారు. బుధవారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మట్టి మాఫియాకు బలైన నెక్కొండ మండలానికి చెందిన సొల్లేటి సునీల్ చిత్రపటానికి పెద్ది పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, అరాచకాలకు, మొరం దందాకు కేరాఫ్ అడ్రస్గా నియోజకవర్గం నిలిచిందన్నారు.
సునీల్ది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని, దీనికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు అనుమతులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. మొరం దందాలో పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు వాటాలున్నాయని, సునీల్ మృతిపై దొంతి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. టిప్పర్తో గుద్ది చంపిన వారిపై చర్యలు తీసుకోకుండా న్యాయం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కుటుంబ సభ్యులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని, ఇది దొంతి ఆదేశాలతోనే జరిగిందని మండిపడ్డారు.
నియోజకవర్గంలో తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే వారిపై వరంగల్ సీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు రక్షణ లేదని, రౌడీ సంసృతి, అరాచకాలు మళ్లీ మొదలయ్యాయన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పెట్టిన ప్రతి అక్రమ కేసుకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ మాజీ కో-ఆర్డినేటర్ తక్కళ్లపెల్లి రవీందర్రావు, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నాడెం శాంతికుమార్, గోనె యువరాజ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.