గీసుగొండ, మే 25 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని, ఉన్నత చదవులు చదివిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే పట్టభద్రుల కోసం పోరాటం చేస్తాడని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కోనాయిమాకుల పీడీఆర్ గార్డెన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రౌడీలు, గుండాలకు టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ మాత్రం పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు.
తీన్మార్ మల్లన్న ఎంతో మంది ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు చివరకు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుర్మార్గుడని, అతడు గెలిస్తే దొంగలకు తాళం ఇచ్చినట్లేనని పేర్కొన్నారు. గెలిస్తే పదవిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకుంటాడని ఆరోపించారు. రైతు బంధు అడిగితే చెప్పులతో కొడ్తామని చెప్పిన మల్లన్నకు పట్టభద్రులు ఓట్లతో బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చిందన్నారు. బీజేపీ అభ్యర్థి ఓటు వేసినా లాభం లేదన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో రాకేశ్రెడ్డి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
పరకాల నియోజకవర్గంలో 14,665 ఓట్లు ఉన్నాయని, అందరూ ఓటింగ్లో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పండించిన పంటలను కొనేనాధుడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, గూడ సుదర్శన్రెడ్డి, కార్పొరేటర్ గద్దె బాబు, మండలాధ్యక్షుడు సారంగపాణి, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు సుంకరి శివకుమార్, బోడకుంట్ల ప్రకాశ్, అంకతి నాగేశ్వర్రావు, గోలి రాజయ్య, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గుర్రం రఘు, బాలకృష్ణ, దామోదర్, జక్కు మురళీ, ప్రమోద్, జూలూరి లెనిన్, ప్రసాద్, ఉజ్వల్, అభిషేక్, నాగరాజు, అజార్ పాల్గొన్నారు.