జఫర్గఢ్, మే 25 : దేశంలో కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి జువారి రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సంపదను తమకు అనుకూలమైన కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నదన్నారు.
దీంతో పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజలు చట్ట సభల్లోకి వెళ్లాలంటే దామాషా ఎన్నికల విధానం అమలులోకి తీసుకురావాలని రాజారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో జఫర్గఢ్లో జిల్లా స్థాయి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సాయన్న, నాయకులు గట్టుమల్లు, ఎండీ జాఫర్, మంద బుచ్చయ్య, ఎండీ కలీల్ తదితరులు పాల్గొన్నారు.