వరంగల్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా.. ప్రశ్నించే గొంతుక, పోరాడే బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం హసన్పర్తిలో నిర్వహించిన వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీకి ఓటు వేయడం వృథా అని చెప్పారు. కడియం శ్రీహరి పోయిన తర్వాత పార్టీలో జోష్ కనిపిస్తున్నదని, పదవులను, కూతురికి టికెట్ తీసుకుని బీఆర్ఎస్కు ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు. కష్టకాలంలో పార్టీని వీడిన ద్రోహులను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని చెప్పారు.
బీఆర్ఎస్ పనిఅయిపోయిందని అంటున్నారని.. తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలపొంగు అని మాట్లాడిన టీడీపీనే తెలంగాణలో లేకుండా పోయిందని గుర్తుచేశారు. కేసీఆర్ పొలంబాట కార్యక్రమానికి అద్భుత స్పందన వస్తున్నదని చెప్పారు. వరంగల్ లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ‘కడియం శ్రీహరి పోయిన తర్వాత పార్టీలో జోష్ కనిపిస్తున్నది. పదవులను, కూతురికి టికెట్ను తీసుకుని బీఆర్ఎస్కు ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తున్నది. ‘కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఏం తకువ చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. అన్ని ఇచ్చిన బీఆర్ఎస్కు కడియం శ్రీహరి జీవితాంతం రుణపడి ఉన్నా తకువే. పార్టీ మారేదే లేదని చెప్పిన శ్రీహరి ఎందుకు మారాడో సమాధానం చెప్పాలి. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు వెతుకుతారు. ఆ అలవాటు రేవంత్రెడ్డికి ఉన్నట్టు ఉంది అని విమర్శించిన కడియం శ్రీహరి అదే రేవంత్రెడ్డితో కండువా కప్పించుకున్నడు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. దొంగలతో కండువా కప్పించుకునే స్థాయికి శ్రీహరి దిగజారుడు అవసరమా? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఆ పార్టీలోకి శ్రీహరి పోయిండు. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. వరంగల్లో ఎంత అద్భుతమైన పోరాటం చేశాం. బీఆర్ఎస్కు కేసులు, పోరాటాలు కొత్త కాదు. ఒకరిద్దరు నాయకులను కొనొచ్చు.
ఉద్యమకారులను, కార్యకర్తలు, ప్రజలను కొనలేరు. అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తు న్నారు. పరకాల ఉప ఎన్నికలో అటుకులు బుకి పనిచేశాం. పెద్ది సుదర్శన్రెడ్డి పొకులు వచ్చి రక్తం కారినా స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేశాం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. కష్టసమయంలో పార్టీని వదిలి వెళ్లిన వారిని మళ్లీ తీసుకునేది లేదు. కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది. ద్రోహం చేసినవాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ. బీఆర్ఎస్కు అండగా ఉన్నది. ఇక్కడి కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తకువే. వరంగల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంతో కృషిచేసింది. ఐదు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషల్ హాస్పిటల్, టెక్స్టైల్ పార్కును తెచ్చాం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్రెడ్డి అంటున్నారు. రాష్ట్ర ప్ర భుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణా న్ని తీసేస్తామని రేవంత్ అంటున్నారు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండమవుతుంది. కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుంది. కాకతీయ తోర ణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక’ అని హరీశ్రావు అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సార య్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధు సూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ అధ్యక్షులు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజుయాదవ్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, లింగంపల్లి కిషన్రావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
కడియం పార్టీలోకి రాకముందు నుంచే స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ గెలిచింది. నాగుపాముకు, శ్రీహరికి తేడా లేదు. మా అవకాశాలు పణంగా పెడితే నీకు అవకాశాలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి వెళ్లడమేనా శ్రీహరి అనుభవం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు ఇచ్చింది. నా జీవితంలో కడియం అంత మోసకారిని చూడలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ ఎంపీగా ఎవరికి అవకాశం ఇచ్చినా కడియం రాజకీయ సన్యాసం తీసుకునేలా పనిచేస్తాం. ఆనాడు ఉద్యమంలో భాగంగా కాళ్లకు బొబ్బలు వచ్చి రక్తం వచ్చినా పాదయాత్ర చేసి ఓడించాం. ఇప్పుడు అంతే కసిగా పనిచేద్దాం. కడియంను చిత్తుగా ఓడించేందుకు సిద్ధం కావాలి. నకజిత్తుల నాయకులకు ఓరుగల్లు పౌరుషం చూపించాలి.
నా రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ప్రతిపక్షం గట్టిగా ఉంటే ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. ఇటీవల పరకాల నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడితే మనం ఉద్యమిస్తే ఎస్సై సస్పెండ్ అయ్యాడు. పోయిన వాళ్లు పోనీయండి. మనం బలంగా ఉండాలి. కేసీఆర్ నిన్న దేవరుప్పులకు వస్తే అందరిలో ఉత్సాహం కనిపించింది. శ్రీహరి పార్టీ నుంచి పోయినంక వరంగల్ పార్లమెంట్ సీటు 25 మంది అడుగుతున్నారు. ఎవరికి సీటు ఇచ్చినా గెలిపించే బాధ్యత మాది. కడియం శ్రీహరికి టీడీపీలో నేనే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన. బీఆర్ఎస్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు శ్రీహరిని ఓడగొట్టే బాధ్యత నాదే.
2001లో సిద్దిపేటలో గులాబీ జెండా ఎగిరినప్పుడు స్టేషన్ ఘన్పూర్లోనూ ప్రజలు గెలిపించారు. రాజయ్య సీటు కడియం శ్రీహరికి ఇస్తే మనం ఓట్లు వేసి గెలిపించాం. కడియం పార్టీ మారేందుకు మూడు నెలల క్రితమే కుట్ర మొదలైంది. కడియం కావ్యకు అవకాశం కోసం అరూరి రమేశ్, పసునూరి దయాకర్, రాజయ్యను వెళ్లగొట్టాడు. ఇటీవలి ఎన్నికల్లోనూ నాకు, దయాకర్రావుకు, వినయ్భాస్కర్కు వ్యతిరేకంగా పనిచేశాడు. మేము మాత్రం ఆయన గెలుపు కోసం పనిచేశాం. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి నేనున్నా. కార్యకర్తలకు అండగా ఉంటా. కడియం శ్రీహరి ఓ బ్రాండ్ అని ఆయన బిడ్డ అంటున్నది. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్కు వెన్నుపోటు పొడవడమే బ్రాండా? శ్రీహరి ఇప్పుడు వస్తే స్టేషన్ఘన్పూర్ ప్రజలు చెప్పుతో కొడతామని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో కడియంకు డిపాజిట్ రాకుండా ఓడగొడతాం.
ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉన్నా కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. శ్రీహరిది నీచమైన చరిత్ర. కుట్ర పన్ని ఎంతో మందిని అణచివేశాడు. వరంగల్ జిల్లాలో ఎన్నో బూటకపు ఎన్కౌంటర్లు జరిగినా స్పందించలేదు. మంత్రి పదవి ఉంటే చాలు అనుకున్నాడు. ఎన్టీఆర్ బలహీన పడగానే చంద్రబాబు పక్షాన నిలిచాడు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు కడియం వెన్నుపోటు పొడిచాడు. సామాజిక ఉద్యమాలకు వెన్నుపోటు పొడిచాడు. మమ్మల్ని కూడా ఎదగకుండా చేశాడు. బీఆర్ఎస్లో దళితులు, బీసీలను ఇబ్బంది పెట్టాడు. కేఏ పాల్ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోనూ చేరతాడు. అలాంటి వ్యక్తికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి.