గీసుగొండ, మార్చి 26: ఓట్లను అమ్ముకుంటే అవినీతిని ప్రోత్సహించినట్లేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదర్శ గ్రామం మరియపురాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిర్మల హృదయ వనంతోపాటు డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనం, నర్సరీ, ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు, గ్రామ పరిశుభ్రతను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. మద్యం అలవాటు ఉన్న వారు తాగడం బంద్ చేస్తే ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రామాల ప్రగతిలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరియపురం గ్రామాభివృద్ధిని ప్రధాని మోదీకి మెయిల్ ద్వారా పంపిస్తానన్నారు. మన్కీ బాత్లో ఆయన మరియపురం గ్రామాభివృద్ధిపై మాట్లాడేలా పోస్టు చేస్తానని చెప్పారు. యువత అవినీతి నిర్మూలనలో ముందుండాలని సూచించారు. అభివృద్ధి ఒక్కటే ముఖ్యం కాదని.. అవినీతి, అక్రమాలను పూర్తిగా నిర్మూలిస్తేనే గ్రామాలుగా ఎదిగినట్లన్నారు. ఎన్నికల సమయంలో తమ ఇండ్ల ముంగిళ్లలో ‘ఓట్లును అమ్ముకోము’ అని బోర్డులు పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి మద్యం తాగడం కూడా ఓ అడ్డంకి అన్నారు.
తాను మహబూబ్నగర్, శ్రీకాకులం, విజయనగరం జిల్లాల్లోని మూడు గ్రామాలను దత్తత తీసుకోని, వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. గ్రామాలను మార్చడం అంత సులభతరం కాదని, దేశంలో 6.12 లక్షల గ్రామాలు ఉన్నయని వివరించారు. వాటి అభివృద్ధిపై తాను పీహెచ్డీ చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే తపన, పట్టుదల ఉంటే దేశంలో అన్ని గ్రామాలు మరియపురంలా తయారవుతన్నారు. ఈ గ్రామానికి దేశవ్యాప్తంగా పేరు రావాలంటే తమ గ్రామంలో ప్రజలకు నిత్యవసారంగా వాడే ఏదైనా వస్తువును తయారు చేయాలని, అప్పుడే మరియపురానికి దేశవ్యాప్తంగా పేరుతోపాటు ఆర్థికంగా లాభాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, యాంటి కరప్షన్ టీం అధ్యక్షుడు రాజేందర్, ఉపసర్పంచ్ చిరంజీవి, నల్లబెల్లి ఎంపీవో కూచన ప్రకాశ్, కార్యదర్శి స్వప్న, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్లొన్నారు.