కృష్ణకాలనీ, జనవరి 5 : బాలలకు అండగా ఆపరేషన్ స్మైల్ నిలుస్తోంది. చిన్నతనంలోనే వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న బాలలను గుర్తించి, వారి భవిష్యత్ను తీర్చిదిద్ది, వారిని ఉత్తమ విద్యావంతులుగా, పౌరులుగా తయారు చేసేందుకు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఏటా జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీసు శాఖ, మహిళలు, బాలల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా శాఖల్లోని ఎనిమిది మంది సభ్యులతో బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి తొమ్మిదో విడుత ఆపరేషన్ స్మైల్ చేపడుతున్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి కొంగర సామ్యూల్ ఆధ్వర్యంలో భూపాలపల్లి, కాటారం సబ్ డివిజన్లు ఏర్పాటు చేసి, డివిజన్ స్థాయిలో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక ఎస్సై, నలుగురు పీసీలు, బాలల పరిరక్షణ సిబ్బంది, సహాయక కార్మిక అధికారి, రెవెన్యూ ఆర్ఐ, చెల్డ్ లైన్ సిబ్బంది ఉన్నారు.
తల్లిందండ్రులు చనిపోయి కొందరు, ఇంటి నుంచి పారి పోయి వచ్చిన మరికొందరు పూటగడవక బాల కార్మికులుగా జీవితాన్ని గడుపుతుంటారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఏటా ఆపరేషన్ స్మైల్ చేపడుతోంది. కమిటీ సభ్యులు తప్పి పోయిన పిల్లల వివరాలు సేకరించి ఒక నివేదిక రూపొందిస్తారు. ఈ వివరాలతో జిల్లాలోని పలు శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో, పని చేసే ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతారు. వీధి బాలలు, బాల కార్మికులు, అక్రమ దత్తత పొందిన పిల్లలు, భిక్షాటన చేస్తున్న పిల్ల లు కనిపిస్తే వారిని తీసుకెళ్లి వారి చిరునామా తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగిస్తారు.నిరాశ్రయులైన పిల్లలు ఉంటే స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వ బాల సదనాల్లో ఆశ్రయం కల్పించి,వారికి భవిష్యత్ అందిస్తారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి వారికి బంగారు భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో 2015 నుంచి పోలీసు, శిశు, సంక్షేమ, కార్మిక, విద్య, వైద్య, రెవెన్యూ శాఖలతో పాటు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా ఏర్పడి ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో జనవరి 1నుంచి తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నారు. భూ పాలపల్లి, కాటారం రెండు సబ్ డివిజన్లను ఏర్పాటు చేసి ఒక్కో డివిజన్లో డివిజన్ స్థాయిలో వివిధ శాఖల నుంచి ఎనిమిది మంది అధికారులతో రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. వీరు తప్పి పోయిన పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు అప్ప గిస్తున్నారు. అనాథ పిల్లలను ప్రభుత్వ, ప్రభుత్వేతర బాలల సదనాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. అదేవిధంగా భిక్షాటన చేస్తున్న బాలలు, అక్రమ రవాణాకు గురైన పిల్లలను గుర్తించి బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరు పరిచి నిరాశ్రయులైన పిల్లలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ బాల సదనాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిద భాగాల్లో పనులు చేస్తూ, భిక్షాటన చేస్తున్న, బాల్య వివాహాలు చేసుకోబోతున్న 325 మంది బాలలను గుర్తించినట్లు బాలల సంరక్షణ అధికారులు తెలిపారు.
జిల్లాలో తొమ్మిదో విడుత ఆపరేషన్ స్మైల్ ప్రారంభమైంది. ఎనిమిది శాఖల అధికారులతో రెండు డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బాల కార్మిక నిషేధ చట్టం మేరకు 18 సంవత్సరాల లోపు పిల్లలు పనులకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. ఇంట్లో నుంచి పారిపోయినా.. తప్పి పోయినా పిల్లలను గుర్తించి దర్పన్ పోర్టల్లో పొందుపరిచి, వీలైనంత త్వరగా, వారి తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు చేపడుతాం.
– కొంగర సామ్యూల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి
ఆపరేషన్ స్మైల్లో భాగంగా జిల్లాలో బాల కార్మికులు, తప్పి పోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించేందుకు పట్టిష్టమైనా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ప్రజలు సైతం వివిధ పని ప్రదేశాల్లో బాల కార్మికులను గుర్తిస్తే 1098 చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలి. వారిని రక్షించి బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పిస్తాం.
– బొప్పరాతి హరికృష్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి