వారంతా పొట్టచేతపట్టుకొని వలస వచ్చిన కూలీలు.. వారివి రోజూ తేనె సేకరించనిదే పూటగడవని బతుకులు.. ఎప్పటిలాగే బతుకువేటకు పోతున్న వారిని, అజాగ్రత్త.. మితిమీరిన వేగంతో వచ్చిన మృత్యుశకటం బలితీసుకున్నది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు చనిపోవడం ఉమ్మడిజిల్లావాసులను కలవరపాటుకు గురిచేసింది. రాజస్థాన్కు చెందిన కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొని అక్కడికక్కడే నలుగురు, దవాఖానలో చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాతపడగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వర్ధన్నపేట, ఆగస్టు 16 : వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. కూలీలతో వెళ్తు న్న ఆటోను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆటో లో ప్రయాణిస్తున్న ఐదురుగు కూలీలు, ఆటో డ్రైవర్ చనిపోయారు. నలుగురు స్పాట్లోనే మృతిచెందగా, ఇద్దరు దవాఖానలో తుదిశ్వాస విడిచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్ల నుంచి తేనె సేకరించి ఉపాధి పొందేందుకు రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన కూలీలు వరంగల్కు వలస వచ్చారు. రోజూ గ్రామాలు తిరుగుతూ తేనె సేకరించి అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నారు. ఇక్కడే తాత్కాలికంగా నివసిస్తున్నవారు, బుధవారం ఉదయం వరంగల్లోని పుప్పాలగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ బట్టు శ్రీనివాస్తో అద్దె మాట్లాడుకొని ఆటోలో తొర్రూరు వైపు బయలుదేరారు.
ఈ క్రమంలో వీరి ఆటోను వర్ధన్నపేట మండలం ఇల్దంద బస్టాండ్ సమీపంలో ఖమ్మం నుంచి వరంగల్ వైపు అతివేగంగా.. అజాగ్రత్తగా వస్తున్న లారీ కుడివైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. స్పాట్లోనే జబాబత్ కురైరి(45), సురేశ్ కురైరి(36), అమిత్ మండల్(34), ఆటో డ్రైవర్ బట్టు శ్రీనివాస్(42) మృతి చెందారు. స్థానికులు వెంటనే వచ్చి క్షతగాత్రులను ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నితీశ్కుమార్(13), రూప్చంద్(45) దవాఖానలో చనిపోయారు. మరో వ్యక్తి అమిత్ (25) తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వరంగల్ పుప్పాలగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ బట్టు శ్రీనివాస్ రోజువారీగా ఆటోను అద్దెకు తీసుకొని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిసింది. శ్రీనివాస్కు భార్య కల్పన, కూతురు సుష్విక(12), కుమారుడు ఉత్తేజ్ (8) ఉన్నారు.
ఘటనా స్థలంలో హృదయవిదారకం..
ఘోర ప్రమాదంతో ఘటనా స్థలమంతా రక్తసిక్తమైం ది. గాయపడ్డవారి ఆర్తనాదాలతో హృదయవిదారకంగా మారింది. రోడ్డుపై ఆటోను లారీ బలంగా ఢీకొని సు మారు 50 మీటర్ల మేరకు లాక్కెళ్లింది. ఆటోలోనే చిక్కుకొని కూలీలు చనిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. కాళ్లు, తలలు, చేతులు వేరుపడి ఆ ప్రాంతమంతా భీతావహంగా కనిపించింది. మృతులను బయటకు తీసేందుకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పలువురు యువకులు ధైర్యం చేసి గాయపడిన వారిని బయటకు తీసి 108లో ఎంజీఎంకు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏసీపీ సురేశ్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రవీణ్కుమార్ హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎంజీఎం వైద్యశాలకు, మృతదేహాలను వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని లారీని వర్ధన్నపేట పోలీసు స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. మృతుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
పరిశీలించిన సీపీ రంగనాథ్..
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆరుగురు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏసీపీ సురేశ్ మొబైల్లో సీసీ కెమెరా ఫుటేజీని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్కు చెందిన లారీ ఢీకొట్టిందని, డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నదని చెప్పారు. డ్రైవర్ తాగి ఉన్నాడా, నిద్ర మత్తులో ఉన్నాడా అన్న విషయం విచారణలో తేలుతుందన్నారు. బతుకు దెరువు కోసం వచ్చిన కూలీలు, ఆటో డ్రైవర్ చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతామన్నారు.