అమ్మాపురం, తాడిచర్లలో నీటిలో మునిగి అన్నదమ్ములు.. రెడ్యాలలో ట్రాక్టర్ ఢీకొని బాలుడు
తొర్రూరు/మల్హర్/మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 11: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు బాలురు మృతిచెందారు. రెండు చోట్ల అన్నదమ్ములే మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం అమ్మాపురం బుడగజంగాల కాలనీకి చెందిన కిన్నెర మహేశ్, సావిత్రి దంపతుల కుమారుడు జంపన్న(10) నాలుగో తరగతి, గంధం స్వామి, దంపతుల కుమారుడు యాకూబ్(12) ఆరో తరగతి ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వీరితోపాటు మరో ముగ్గురు పిల్లలు సరదాగా ఈత కొట్టేందుకు వరద కాల్వకు వెళ్లారు. నీటి గుంతలో దిగి కొడుతుండగా యాకూబ్, జంపన్న లోతుకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయారు. గమనించిన తోటి స్నేహితులు భయంతో సాయం కోసం కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. సుమారు కిలోమీటర్ దూరంలోని జీకేతండాలో నరేశ్ అనే వ్యక్తి కనిపించగా చెప్పారు. అతడు చేరుకునేసరికి యాకూబ్, జంపన్న మృతదేహాలు నీటిపై తేలి కనిపించాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై జగదీశ్ యాకూబ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్లకు బొంతల రాజు, అనూష దంపతుల కుమారులు అరుణ్(12), కార్తీక్ (9) ఉదయం తల్లి అనూషతో కలిసి వారికున్న మేకలను ఊరు బయటకు మేతకు తోలుకెళ్లారు. మధ్యాహ్నం తల్లి ఇంటికి వచ్చింది. 3గంటలకు వారి ఇంటి సమీపంలోకి వచ్చాయని చుట్టుపక్కల వారు ఆమెకు చెప్పారు. దీంతో పిల్లల కోసం వెతకగా కనిపించలేదు. పెంజరుచెరువు వద్ద చెప్పులు కనిపించాయని పలువురు చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా తన పిల్లలవేనని గుర్తించింది. స్థానికులు వచ్చి చెరువులో గాలించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. కొయ్యూర్ పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాలకు చెందిన కోర్ని రామ్మూర్తి, జన్య దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కొడుకు సాత్విక్(5) శనివారం రాత్రి గ్రామంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు తల్లి, కొడుకు వెళ్లారు. తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా ఓ ట్రాక్టర్ వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. దీంతో సాత్విక్ అక్కడికక్కడే మృతిచెందగా, సౌజన్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం వరంగల్లోని దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. రామ్మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.