వరంగల్, ఆగస్టు 11(నమస్తేతెలంగాణ): ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరుపై పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను తాము ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారుల వల్ల ప్రజలు, ప్రభుత్వానికి నష్టం కలుగుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన శుక్రవారం వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్ పీ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్వినీ తానాజీ వాకడే, ఇన్చార్జి సీఈవో ఎం సంపత్రావుతోపాటు జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు, ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలోని లింగాపురం గ్రామంలో ఓ రైతు బావిలో పడి చనిపోయాడని, అర్హత ఉన్నా అతడి కుటుంబానికి రైతుబీమా పథకం వర్తించలేదని ఎంపీపీ విజేందర్ అన్నారు. వ్యవసాయశాఖ అధికారులు సమాచారం అందించి రైతుబీమా పథకం కోసం సదరు రైతు పేరు నమోదు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వమే రైతుల పేరిట ప్రీమియం చెల్లిస్తున్నందున బీమా పథకం కోసం పేర్లను నమోదు చేసుకునే గడువు సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఏటా అర్హులకు అందించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన బిల్లులు మూడు శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వాహకులకు ఇప్పటికీ అందలేదన్నారు. శాయంపేట ఎంపీపీ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ శాయంపేట మండల ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ రాజ్కుమార్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, విద్యుత్ సమస్యలపై స్పందంచకపోవడం వల్ల మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. పరకాల మండలంలో తమ వాటాధనం చెల్లించిన గొర్రెల పెంపకందారులకు సబ్సిడీ గొర్రెల యూనిట్లను అందజేయాలని జడ్పీటీసీ మొగిలి కోరారు.
చేపల కోసం మత్తళ్లపై అక్రమంగా కొందరు సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసి ఇనుప జాలీలను అమర్చడం వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు కట్టలు తెగిపోయాయని వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి, చెన్నారావుపేట ఎంపీపీ విజేందర్తోపాటు పలువురు సభ్యులు అన్నారు. వరదలో కొట్టుకొచ్చిన చెత్త తట్టుకోవడంతో జాలీల నుంచి నీరు బయటకు వెళ్లలేని స్థితిలో పలు గ్రామాల్లో పెద్దపెద్ద చెరువుల కట్టలు తెగిపోయాయని, పంటలు పండించుకోవడానికి రైతులకు సాగునీరు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ చాలా గ్రామాల్లో ఇదే జరిగిందని ఇరిగేషన్, మత్స్యశాఖల అధికారులు సంయుక్తంగా చెరువులను విజిట్ చేసి సిమెంటు స్తంభాలతో ఏర్పాటు చేసిన ఇనుప జాలీలను పరిశీలించాలన్నారు. ఇనుప జాలీలు ఉంటే వెంటనే తొలగించాలని, మత్స్యకారులు, రైతులు బాగుండాలని, ఈ నేపథ్యంలో అవసరమైతే ఇనుప జాలీలకు బదులు ప్లాస్టిక్ జాలీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు.
మత్స్యకారుల ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేస్తుంటే కొందరు తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతూ మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత చేప పిల్లల్లో పది శాతం కూడా చెరువుల్లో విడుదల చేయడం లేదని, చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయడం పూర్తయ్యాక మత్స్యశాఖ అధికారులు చెరువు వారీగా నిర్దేశిత లక్ష్యం ప్రకారం చేప పిల్లలను విడుదల చేసినట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సంగెం, శాయంపేట ఎంపీపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయడానికి ముందే మత్స్యశాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తే అక్రమాలకు తావు ఉండదన్నారు. దీనిపై జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ చెరువుల్లో చేప పిల్లల విడుదలపై కలెక్టర్ ఫోకస్ పెట్టాలని, ఆయా చెరువులో విడుదల చేసే చేప పిల్లల సమాచారాన్ని కొద్దిరోజుల ముందే మత్స్యశాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని అన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెగిన చెరువులను మరమ్మతు చేసి రైతులను ఆదుకోవాలని పరకాల, వర్ధన్నపేట జడ్పీటీసీ సభ్యులు మొగిలి, భిక్షపతి కోరారు. పరకాల మండలంలోని మల్లక్కపేట, పైడిపల్లి గ్రామాల పెద్ద చెరువుల కట్టలు తెగాయని, ప్రస్తుతం ఈ చెరువుల్లో చుక్క నీరు లేదని మొగిలి తెలిపారు. మరమ్మతు పనులు చేపట్టి సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కాల్వ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో నింపితే మల్లక్కపేట, పైడిపల్లి చెరువుల కింద రైతులు యాసంగి పంటలను సాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. రైతులు వరి నాట్లు వేసుకుంటున్నందున నీరు లేని చెరువుల్లోకి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలను సరఫరా చేయలని భిక్షపతి కోరారు. ఇటీవల భారీ వర్షాల వల్ల నేలకూలిన కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో నాలుగైదు రోజుల్లో కొత్తవి ఏర్పాటు చేసి రైతులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కూడా కోరారు. జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల కోసం ఎస్సారెస్పీ డీబీఎం-38 కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలతో రైతులు ఆందోళన చెందుతున్నందున తెగిన చెరువులను మరమ్మతు చేసి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వాటిలో నీరు నింపేందుకు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
పీఏసీఎస్ల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, తప్పులెన్ని చేసినా ఇక్కడే కొనసాగుతామనే ధీమాతో పీఏసీఎస్ల్లో పని చేస్తున్న కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వర్ధన్నపేట, శాయంపేట ఎంపీపీలు అప్పారావు, తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మండల సభలకు పీఏసీఎస్ల చైర్మన్లు వస్తున్నారు గాని కార్యదర్శులు రావడం లేదన్నారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ఇకనుంచి పీఏసీఎస్ల కార్యదర్శులు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు విధిగా హాజరు కావాలని, ఇతర శాఖల అధికారులు కూడా గైర్హాజరు కావొద్దన్నారు. ఆయిల్పామ్ సాగును మరింత వేగవంతం చేయాలని, ఉద్యాన, వ్యవసాయాధికారులు సమన్వయంతో రైతులను ఆయిల్పామ్ సాగులో ప్రోత్సహించాలని ఆమె చెప్పారు. సమావేశంలో డీఏవో ఉషాదయాళ్, ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, డీసీవో సంజీవరెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, డీఎంవో ప్రసాదరావు, మత్స్య, పశుసంవర్ధక శాఖల జిల్లా అధికారులు నరేశ్కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ఆద్యంతం వాడీవేడిగా జరిగింది. పలు అంశాలపై సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరును ఎండగట్టారు. పర్వతగిరి జడ్పీటీసీ సింగులాల్ మాట్లాడుతూ ఇటీవల ఏనుగల్ గ్రామంలో తాటిచెట్టు మీద పడడంతో రైతు మరణించాడని, ఆధారుకార్డు ప్రకారం అతడి వయస్సు 45 ఏండ్లు ఉందన్నారు. కానీ, వ్యవసాయశాఖ అధికారులు 62 ఏండ్లుగా పేర్కొన్నారన్నారు. దీంతో సదరు రైతు కుటుంబానికి రూ. 5 లక్షల రైతుబీమా అందలేదని వాపోయారు. 1981లో జన్మించిన అతడి పేరన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, పట్టాదారు పాస్పుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందే అవకాశం ఉండగా, కేవలం వ్యవసాయ అధికారుల తప్పిదం వల్ల ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ రాలేదని ఆరోపించారు. ఆధారాలతో వెళ్తే ఇప్పుడు తాము ఏమీ చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకుని రైతు కుటుంబానికి రూ. 5 లక్షల రైతుబీమా అందించాలని సింగులాల్ కోరారు.
వరంగల్లోని పండ్లు, కూరగాయల మార్కెట్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. ఈ మార్కెట్లోని అడ్తిదారులు రైతుల నుంచి నాలుగు శాతం ఫీజుకు బదులు పది శాతం గుంజుతున్నారని, గతంలో కూడా ఈ విషయాన్ని సమావేశం దృష్టికి తెచ్చినా మార్పు లేదని సంగెం, దుగ్గొండి, గీసుగొండ జడ్పీటీసీలు సుదర్శన్రెడ్డి, ఏ శ్రీనివాస్, ధర్మారావు అన్నారు. రైతులకు అందజేసే తక్పట్టిలో మాత్రం అడ్తిదారులు రెండు శాతమని పేర్కొంటున్నారని, మార్కెట్ అధికారుల సాక్షిగా ఈ దోపిడీ కొనసాగుతున్నదని ఆరోపించారు. ప్రతిరోజు రూ. కోట్ల టర్నోవర్ జరుగుతుండడం వల్ల రైతులు ఆర్థికంగా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని, దోపిడీని అరికట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రైతుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజు వసూలు చేయాలని, ముందుగా అడ్తిదారులకు ఒకసారి చెప్పి పద్ధతి మార్చుకోకపోతే చట్టప్రకారం చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ తీరుపై సభ్యులు పలువురు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న సన్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఖానాపురం మండలంలోని రేషను డీలర్లు కొందరు ప్రభుత్వం కేటాయిస్తున్న బియ్యంలో సన్న బియ్యాన్ని అమ్ముకుంటూ దొడ్డు బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారని ఎంపీపీ ప్రకాశ్రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ షాపును డీలర్లు తమ ఇండ్లలో నిర్వహిస్తున్నారన్నారు. పరకాల ఎంపీపీ స్వర్ణలత మాట్లాడుతూ రేషన్ షాపులపై నిఘా కొరవడిందని, సంబంధిత అధికారులెవరూ రేషన్ షాపులను విజిట్ చేయకపోవడం వల్ల అక్రమాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. పరకాలలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్ శిథిలావస్థలో ఉండడం వల్ల ఇటీవల భారీ వర్షాలకు గోడౌన్లోని బియ్యం నిల్వలు తడిసి పాడయ్యాయని, ఈ గోదాములో బియ్యం దిగుమతి, ఎగుమతి కూడా కష్టంగా ఉందన్నారు. వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయకుండా ఇన్చార్జిలతో వ్యవస్థ నడుపుతుండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కొత్త గ్రామ పంచాయతీల పరిధిలో రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు కోరారు.