ములుగు, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడంలో రాజకీయ పట్టింపులు లేకుండా పోడు సాగుచేసుకుంటున్న రైతులందరికీ అందజేస్తోంది. ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) తల్లిదండ్రులు దనసరి సమ్మయ్య-సమ్మక్క గురువారం పోడు పట్టా అందుకున్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ఐదుగురికి పట్టాలు అందించగా అందులో సీతక్క తండ్రి సమ్మయ్య పేర 1 ఎకరం 17గంటల భూమికి చెందిన పట్టాదారుల పాస్పుస్తకాన్ని జడ్పీటీసీ భవాని, ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీటీసీ విజయ్రాంనాయక్, సర్పంచ్ సువర్ణరాణి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏండ్లుగా తాను ఎకరం 17గుంటల భూమిని సాగు చేస్తున్నామని, ప్రస్తుతం చాత కాకపోవడంతో వేరే వారితో వ్యవసాయం చేయిస్తున్నట్లు తెలిపారు. ఇన్నేళ్లుగా పోడు భూములు దున్నేందుకు రైతులు భయపడేవారని, ఫారెస్ట్ అధికారులు కూడా ఇబ్బందులు పెట్టేవారని చెప్పారు. తమ భూమికి పట్టా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పట్టా రావడం వల్ల ఎవరు వత్తరో, ఏమంటరో అని భయం లేదని తెలిపారు. పట్టా వచ్చిన భూమిని నా బిడ్డ సీతక్క కన్నా, నా కొడుకు పిల్లల కన్నా రాసిస్తామని చెప్పారు.
పారదర్శకతకు నిదర్శనం
గత ప్రభుత్వాలు పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోవడంతో వారు ఎన్నో పోరాటాలు చేసేవారు. అప్పు చేసి పంట వేస్తే ఫారెస్ట్ అధికారులు పంటలను నాశనం చేసేవారు. దీంతో పోడు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొనేవారు. ఈ సమస్య గత 70 ఏండ్లలో పరిష్కారం కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోడు రైతులకు పట్టాలను అందిస్తున్నారు. పోడు సాగు చేస్తున్న అర్హులైన రైతులందరికీ పట్టాలు ఇస్తున్నారు. జగ్గన్నపేటకు చెందిన ఎమ్మెల్యే సీతక్క తండ్రికి సైతం పోడు పట్టా వచ్చిందంటే పారదర్శకతకు నిదర్శనం.