తొర్రూరు, ఏప్రిల్ 28 : పేగు బంధం మృత్యుపాశమైంది. కుటుంబ కలహాలతో కసాయిలా మారిన ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. తరచూ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టాయి. భార్యాభర్తల మధ్య పొడచూపిన విభేదాలు చివరికి విషాదానికి దారి తీశాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కన్నబిడ్డలకు ఉరేసి, తానూ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో కలకలం రేపింది.
కన్నబిడ్డలతో కలిసి తండ్రి మృత్యువును ఎంచుకోవడం ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికుల కథనం ప్రకారం.. అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంషావలి (30)కి అదే గ్రామానికి చేందిన శాంతతో వివాహం జరిగింది. గుంషావలి తొర్రూరులో బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ జరిగే గొడవలు, తాగుడు అలవాటు అతడి జీవితాన్ని చీకట్లోకి నెట్టాయి.
15 రోజుల క్రితం జరిగిన గొడవతో భార్య శాంత ముగ్గురు పిల్లలతో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పిల్లలకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి అత్తగారింటి నుంచి ఇద్దరు చిన్నారులు విలాస్ (5), వికేశ్ (3)ను వెంట తీసుకెళ్లిన గుంషావలి సాయంత్రానికి అమానుష నిర్ణయం తీసుకున్నాడు. తొర్రూరు శివారులోని వ్యవసాయ మారెట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వేప చెట్టుకు ముందుగా ఇద్దరు చిన్నారులకు ఉరేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. భార్య శాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.