వరంగల్, డిసెంబర్ 25(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కనీస వసతులు సమకూర్చే సదుద్దేశంతో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో తొలి విడుతలో అభివృద్ధి చేసేందుకు 223 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఈ స్కూళ్లల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్నింట్లో వంద శాతం, మరికొన్నింట్లో చిన్న చిన్న మిగిలి ఉన్నాయి. ఇటీవల తొలి విడుత పనులపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ బీ గోపి సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. జనవరి 5వ తేదీ వరకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ప్రతి మండలంలో రెండేసి చొప్పున మొత్తం 26 పాఠశాలలను మోడల్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచారు. పనులు తుది దశకు చేరిన పాఠశాలల ప్రారంభానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. జనవరి ఆరంభంలో ప్రారంభించేందుకు జిల్లాలో 26 పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు. ఐదో తేదీ వరకు సిద్ధం చేసేందుకు తలమునకలయ్యారు. తొలివిడుత సెలెక్ట్ చేసిన వాటిల్లో పనులు పూర్తయిన స్కూళ్లను జనవరి ఏడో తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కలెక్టర్ బీ గోపి శనివారం ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమం అమల్లో భాగస్వాములు అవుతున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతితో పాటు ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు, ఎంపీడీవోలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు. తొలి విడుత ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)లు, పాఠశాలల్లో చేస్తున్న పనులను మండలం వారీగా తెలుసుకున్నారు. ఇటీవల వివిధ పాఠశాలలను సందర్శించి పరిశీలించిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా ప్రతి మండలంలో రెండేసి పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐదో తేదీ వరకు జిల్లాలో 26 పాఠశాలలను రెడీ చేయాలని స్పష్టం చేశారు.
26 పాఠశాలలు ఇవే..
తొలి విడుత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 223 పాఠశాలలను సెలక్ట్ చేసింది. వీటిలో అవసరాలను గుర్తించి అధికారులు రూపొందించిన అంచనాల మేరకు అభివృద్ధి పనుల కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. రూ.30 లక్షల్లోపు అభివృద్ధి పనులను స్కూల్ ఎస్ఎంసీకి అప్పగించింది. రూ.30 లక్షలకుపైగా విలువైన అభివృద్ధి పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు కేటాయించింది. రూ.30 లక్షల్లోపు విలువైన పనులు గల పాఠశాలలు జిల్లాలో 165 ఉన్నాయి. ఎస్ఎంసీల చొరవతో ఈ పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో మండలానికో రెండింటిని మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు.
ఈ పాఠశాలల్లో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని వంద శాతం, మరికొన్నింటిలో కలర్స్, ఇతర మిగులు పనులు కొనసాగుతున్నాయి. మిగులు పనులన్నింటినీ జనవరి 5వ తేదీలోపు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు డెడ్లైన్ పెట్టారు. వీటిలో మండలం వారీగా చెన్నారావుపేటలోని ఖాదర్పేట, అమృతండా, దుగ్గొండిలోని అడవిరంగాపురం, దేశాయిపల్లి, గీసుగొండలోని మొగిలిచర్ల, మనుగొండ, ఖనాపురంలోని బుధరావుపేట, కొత్తూరు, ఖిలావరంగల్లోని రంగశాయిపేట, ఎస్ఆర్ఆర్తోట, నల్లబెల్లిలోని రేలకుంట, నల్లబెల్లి, నర్సంపేటలోని ఇటికాలపల్లి, హనుమాన్దేవల్, నెక్కొండలోని పనికర, నెక్కొండ, పర్వతగిరిలోని పర్వతగిరి ఎంపీపీఎస్, జడ్పీఎస్ఎస్, రాయపర్తిలోని కొత్తూరు ఎంపీపీఎస్, జడ్పీఎస్ఎస్, సంగెంలోని మొండ్రాయి, సంగెం, వరంగల్లోని దేశాయిపేట, మట్టెవాడ, వర్ధన్నపేటలోని కట్య్రాల, దమ్మన్నపేట పాఠశాలలు ఉన్నాయి.
తల్లిదండ్రులు సంబురపడుతున్నారు ;– దండు అశోక్, ఎస్ఎంసీ చైర్మన్,మొగిలిచర్ల
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో మా ఊరి బడి రూపు రేఖలు మారిపోతున్నాయి. స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అనేక సౌలత్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి రూ.14 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో విద్యుదీకరణ, నీటి సరఫరా, శానిటేషన్ పనులు, ఇతర మరమ్మతులు, ప్రహరీ, కిచెన్ నిర్మాణం జరిగింది. రంగులు వేయడం కూడా పూర్తయింది. జనవరి 5న ఈ పాఠశాల ప్రారంభం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.