ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ప్రధాన పంటలైన పత్తి, వరి, మక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా పత్తి సాధారణ విస్తీర్ణంలో కూడా సాగు కాలేదు. గతేడాది 6,37,133 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ సంవత్సరం వానకాలంలో 5,26,727 ఎకరాల్లో మాత్రమే సాగైంది. అలాగే వరి గతేడాది 9,12,227 ఎకరాల నుంచి 9,00,215 ఎకరాలకు, మక్కజొన్న 75,336 ఎకరాల నుంచి 64,768 ఎకరాలకు తగ్గిపోయింది. గతేడాదితో పోల్చితే వరి 12వేల ఎకరాల విస్తీర్ణం తగ్గినప్పటికీ సాధారణ విస్తీర్ణం దాటింది. కాగా పత్తి 4,21,382 టన్నులు, వరి 18,00,430 టన్నులు, మక్కజొన్న 95,856 టన్నుల దిగుబడి రానుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 6,37,759 ఎకరాలు. పత్తి సాగులో జనగామ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలవారీగా వరంగల్ 1,30,908, హనుమకొండ 1,08,944, మహబూబాబాద్ 94,193, ములుగు 27,148, జయశంకర్ భూపాలపల్లి 1,14,891, జనగామ 1,61,675 ఎకరాలుగా ఉంది. గతేడాది వానకాలం ఉమ్మడి జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం దాదాపు సాధారణానికి చేరింది. ఆరు జిల్లాల్లోని రైతులు 6,37,133 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశారు. ఇందులో జిల్లాలో వరంగల్ 1,28,605, హనుమకొండ 83,778, మహబూబాబాద్ 1,25,570, ములుగు 25,718, భూపాలపల్లి 1,08,462, జనగామ 1,65,000 ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గతేడాది జనగామ జిల్లాలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పత్తి సాగు చేయడం గమనార్హం. ఈ ఏడాది వానకాలం ఏ ఒక జిల్లాలోనూ పత్తి పంట సాగు విస్తీర్ణం సాధారణం కంటే దాటలేదు. జిల్లావారీగా రైతులు వరంగల్లో 1,22,088, హనుమకొండలో 82,155, మహబూబాబాద్లో 81,146, ములుగులో 26,112, భూపాలపల్లిలో 89,800, జనగామలో 1,25,426 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆరు జిల్లాల్లో ఈ ఏడాది రైతులు 5,26,727 ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంట నుంచి 4,21,382 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. జిల్లావారీగా వరంగల్లో 97,670, హనుమకొండలో 65,724, మహబూబాబాద్లో 64,917, ములుగులో 20,890, భూపాలపల్లిలో 71,840, జనగామలో 1,00,341 టన్నుల పత్తి దిగుబడులు రావొచ్చని ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్ మీడియం స్టేపుల్ పత్తి రూ.6,620, లాంగ్ స్టేపుల్ పత్తి రూ.7,020. సీసీఐ ద్వారా మద్దతు ధరతో రైతుల నుంచి పత్తిని కొనేందుకు అధికారులు నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో గతేడాది వానకాలం కంటే ఈ ఏడాది వానకాలం వరి పంట సాగు విస్తీర్ణం సుమారు 12వేల ఎకరాలు తగ్గింది. గతేడాది వానకాలం రైతులు 9,12,227 ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలవారీగా వరంగల్లో 1,35,254, హనుమకొండలో 1,45,900, మహబూబాబాద్లో 2,12,700, ములుగులో 1,00,298, భూపాలపల్లిలో 1,04,828, జనగామలో 2,13,247 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది వానకాలం వరి పంట సాగు విస్తీర్ణం 9,00,215 ఎకరాలకు తగ్గింది. జిల్లావారీగా వరంగల్లో 1,34,354, హనుమకొండలో 1,46,020, మహబూబాబాద్లో 2,10,270, ములుగులో 84,910, భూపాలపల్లిలో 1,10,900, జనగామలో 2,13,761 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో సుమారు పదిహేను వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం పడిపోయింది. ఆ తర్వాత వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వరి పంట సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గింది. భూపాలపల్లి, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొంత విస్తీర్ణం పెరిగింది. గతేడాది వానకాలం కంటే ఈ ఏడాది వానకాలం కొంత తగ్గినా ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం సాధారణం కంటే దాటింది. సాధారణ విస్తీర్ణం 7,07,757 ఎకరాలు. ఇందులో జిల్లావారీగా వరంగల్లో 1,06,749, హనుమకొండలో 1,12,396, మహబూబాబాద్లో 1,59,408, ములుగులో 98,861, భూపాలపల్లిలో 93,298, జనగామలో 1,37,045 ఎకరాలు ఉంది. ప్రతి జిల్లాలో ఏటా రైతులు సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వానకాలం ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి నుంచి 18,00,430 టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. జిల్లావారీగా వరంగల్లో 2,68,708, హనుమకొండలో 2,92,040, మహబూబాబాద్లో 4,20,540, ములుగులో 1,69,820, భూపాలపల్లిలో 2,21,800, జనగామలో 4,27,522 టన్నులు వచ్చే అవకాశం ఉందని ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక రూపొందించారు.
మక్కజొన్న పంట ఉమ్మడి జిల్లాలో సాధారణ విస్తీర్ణం కూడా దాటడం లేదు. గతేడాది వానకాలం, ఈ ఏడాది వానకాలం సాధారణం కంటే తక్కువ విస్తీర్ణంలో రైతులు మక్కజొన్న సాగు చేశారు. మక్కజొన్న సాధారణ విస్తీర్ణం 83,765 ఎకరాలు. ఇందులో జిల్లాలవారీగా వరంగల్లో 23,371, హనుమకొండలో 12,745, మహబూబాబాద్లో 35,032, ములుగులో 2,144, భూపాలపల్లిలో 965, జనగామలో 9,508 ఎకరాలుగా ఉంది. గతేడాది వానకాలం ఉమ్మడి జిల్లాలోని రైతులు 75,336 ఎకరాల్లో మక్కజొన్న పంట సాగు చేశారు. జిల్లావారీగా పరిశీలిస్తే వరంగల్లో 12,462, హనుమకొండలో 3,872, మహబూబాబాద్లో 54,080, ములుగులో 1,119, భూపాలపల్లిలో 280, జనగామలో 3,523 ఎకరాల్లో మక్కజొన్న పంట సాగులోకి వచ్చింది. ఈ ఏడాది వానకాలం 64,768 ఎకరాల్లో రైతులు మక్కజొన్న వేశారు. జిల్లాలవారీగా చూస్తే వరంగల్లో 5,207, హనుమకొండలో 5,226, మహబూబాబాద్లో 50,211, ములుగులో 1,204, భూపాలపల్లిలో 95, జనగామలో 2,825 ఎకరాల్లో మక్కజొన్న సాగులోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పంట ద్వారా 95,856 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వరంగల్లో 7,706, హనుమకొండలో 7,734, మహబూబాబాద్లో 74,312, ములుగులో 1,782, భూపాలపల్లిలో 141, జనగామలో 4,181 టన్నుల మక్కజొన్న దిగుబడి రావొచ్చని తెలిపారు.