వాజేడు/ఎల్కతుర్తి, ఫిబ్రవరి 10 : అన్నదాతలను యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. దానిపై అవగాహన లేక యూరియా అందక ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో వరి, మిర్చి తదితర పంటలు సాగు చేసిన రైతులు కొందరికి స్మార్ట్ ఫోన్లు లేక, మరికొందరికి పట్టాదారు పాస్బుక్కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోకపోవడంతో ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ అధికారులు యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలో అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలో రైతు పాస్బుక్, ఫోన్ నంబర్ నమోదు చేసుకున్న తర్వాత చాలా షాపుల్లో జీరో స్టాకే దర్శనమిస్తున్నది. కొన్ని షాపుల్లో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని చూపిస్తుండడంతో రైతులు ఆ షాపును ఎంచుకుంటున్నారు. తీరా అక్కడికి వెళితే స్టాక్ లేదని, యాప్లో లోపాల వల్ల తప్పుడుగా చూపిస్తుందని షాప్ యజమానులు చెబుతుండడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ అధికారులను సం ప్రదించగా, మొన్నటి వరకు జిల్లా యూనిట్గా తీసుకోవడంతో ఇతర మండలాల వారు వచ్చి తీసుకెళ్లారని, డీలర్లు స్టాక్ ఎంత ఉందో యాప్లో అప్డేట్ చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని చేతులు దులుపుకుంటున్నారు.
యూరియా బస్తాలు కొనేందుకు వస్తే యాప్లో బుక్ చేసుకోమని చెబుతున్నారు. గత ప్రభు త్వంలో ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలుగలేదు. ఇప్పుడు యూరియా బస్తాల కోసం ఇలాంటివి పెడితే మాలాంటి చదువుకోని వారు ఎలా బుక్ చేసుకుంటారు?
నాకు ఆరెకరాల భూమి ఉండగా, ఎకరాకు 3 బస్తాలను రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు. నాతో పాటు మరో ఇద్దరు కలిసి మొదటి విడతగా 18 బస్తాలను బుక్ చేశాం. ఎల్కతుర్తి సొసైటీ లో బస్తాలు లేకపోవడంతో దామెరలోని ఫర్టిలైజర్ షాపులో 30 బస్తాల స్టాక్ ఆన్లైన్లో కనిపించడంతో బుక్ చేశాం. తీరా అక్కడికి వెళితే 9 బస్తాలే ఉన్నాయని షాపు యజమాని చెప్పాడు. యాప్లో తప్పు వల్ల ఇలా స్టాక్ కనిపిస్తుందని చెప్పాడు. ఈ విషయంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.