తొర్రూరు : మహబూబాబాద్ ( Mahabubabad ) జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు(Procurement Centers ) ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం వంటి కారణాలతో జిల్లాలోని మార్కెట్ యార్డులు మొక్కజొన్నతో ( Maize ) నిండిపోయాయి.
గన్ని బ్యాగులు, లారీల కొరత తీవ్రంగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మార్కెట్ యార్డులన్నీ మక్క బస్తాలతో కిక్కిరిసిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కాంటా వేసిన మొక్కజొన్నను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో రైతులు రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది.
సుమారు 5వేల బస్తాల మక్క నిల్వ ఉండగా, లారీల కొరత కారణంగా వాటిని తరలించ లేకపోతున్నామని అధికారులు స్వయంగా చెబుతున్నారు. సుమారు 25 వేల గన్ని బ్యాగులు అవసరం ఉండగా, కేవలం 5000 బ్యాగులు మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితులపై ఆగ్రహం చెందిన రైతులు సోమవారం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై మొద్దులు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, రైతులు వెనక్కి తగ్గకుండా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.