Collector Sneha Shabarish | ధర్మసాగర్, (వేలేరు) జూలై 16 : వ్యవసాయంలో జరిగే మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు విధానాలను మార్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండల పరిధిలోని గుండ్లసాగర్ గ్రామంలో సారంగపాణి అనే రైతుకు సంబంధించిన అయిల్ పామ్ గెలల కోత కార్యక్రమాన్ని జిల్లా ఎజెన్సీ సంస్థ కేఎన్ బయోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయం వరి పంటలాగా రాకపోయిన దీర్ఘకాలికంగా ఆదాయం వస్తుందని అన్నారు. వరి వేసి రైతులు నష్టపోయో బదులు మంచి ఆదాయం ఉన్న పంటలనే సాగు చేయాలని చెప్పారు. ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు అధిక లాభాలు కలుగుతాయని చెప్పారు. ఆయిల్ పామ్ పంట విషయంలో ప్రభుత్వం తరపున అన్నీ రకాల సహకారాలు అందిచడం జరుగుతుందని వివరించారు.
.కేవలం ఆర్థికపరమైన సలహాలు కాకుండా సాంకేతిక పరమైన సహయం కూడా అందించేందుకు ఇటు ఉద్యానశాఖతో పాటు కెఎన్ బయోసైన్స్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలో సారంగపాణితో పాటు ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే రైతు తోటల్లో గెలలను కత్తిరించి అప్పటికప్పుడే వారికి రావాల్సిన డబ్బులను చెక్కు ద్వారా అందించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ డీహెచ్ఎస్వో లు అనసూయ, శ్రీనివాసరావు. డీఏవో రవీందర్ సింగ్, ఏడీఏ రాజ్ కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారులు రాకేశ్, సుష్మిత, తహశీల్దార్ హెచ్ కొమి, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, ధర్మసాగర్, వేలేరు మండలాల ఏవోలు రాజేశ్, కవిత, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.