నర్సంపేట రూరల్, జనవరి 28: మిర్చి రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త నర్సయ్య సూచించారు. మండలంలోని మాదన్నపేట రైతు వేదిక భవనంలో ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్, డాట్సీ సహకారంతో మండలంలోని మిర్చి రైతులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్చి సాగు చేసే రైతులు మొదట భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భూసారానికి తగిన పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందొచ్చన్నారు. రైతులందరూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో చేరి సంఘటితంగా వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడి, పనిముట్లు, విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై ప్రభుత్వం నుంచి పొందాలన్నారు. పెట్రోల్ బంక్లు, ఎరువుల కంపెనీ, రైస్ మిల్లులు సొంతంగా ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక సహకారం అందిస్తుందని వివరించారు. గిడ్డంగులు, కోల్డ్స్టోరేజ్లను రైతులు వినియోగించుకోవాని కోరారు.
సామూహిక వ్యవసాయం చేయాలి
సామూహిక వ్యవసాయం చేయడానికి ఎఫ్పీవోలు ఏర్పాటు చేసుకొని నాబార్డ్ సహకారం తీసుకోవాలని ఏజీఎం చంద్రశేఖర్ రైతులకు సూచించారు. వాతావరణ మార్పులతో తామర పురుగు వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రసాయనాలను విచ్చలవిడిగా భూమిలో వేయొద్దని, భూమిని విషతుల్యం చేయొద్దని కోరారు. ముఖ్యంగా రైతులు ఖర్చులు పెంచుకొని నష్టపోవద్దని, సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, సీనియర్ సైంటిస్ట్ అనిల్కుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీ నర్సిరెడ్డి, స్పైసెస్ బోర్టు అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ణ, ఏవో కృష్ణకుమార్, ఏఈవోలు మెండు అశోక్, శ్యామ్, ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, కన్జ్యూమర్ విజిలెన్స్ ఫోరం విజిలెన్స్ మెంబర్ రవీందర్, అగ్రికల్చర్ డైరెక్టర్ సారంగం, నాగెళ్లి సారంగం, వసంత, కుమారస్వామి, యాదగిరి పాల్గొన్నారు.