‘చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండడం లేదు.. సమయానికి విధులకు రావడం లేదు.. పని దినాల్లో రైళ్లు, బస్సుల్లో వచ్చిపోతున్నారు.. వేలకోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుంటే ఇలాంటి వారి తీరుతో సర్కారు పాఠశాలలపై నమ్మకం కోల్పోతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నరు.. పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది’ అంటూ జడ్పీ సభ్యులు మండిపడ్డారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికలో విద్యాశాఖ తీరును జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వరంగల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎండగట్టారు.
వరంగల్, డిసెంబర్ 8(నమస్తేతెలంగాణ) : స్థానికంగా ఉండని ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు అనర్హులను ఎంపిక చేస్తున్నారని, తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున చెల్లించాలని, డబ్బు చెల్లించిన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన శుక్రవారం వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. ముందుగా జనగామ జడ్పీ అధ్యక్షుడు సంపత్రెడ్డికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం సభ్యులు వివిధ అంశాలను ప్రస్తావించడంతో సమావేశం వాడీవేడిగా జరిగింది. కొన్ని అంశాలపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
జడ్పీ వైస్ చైర్మన్, దుగ్గొండి జడ్పీటీసీ ఏ శ్రీనివాస్, జడ్పీలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, నల్లబెల్లి జడ్పీటీసీ పెద్ది స్వప్న మాట్లాడుతూ కొద్దిరోజుల నుంచి తుఫాన్ ప్రభావంతో వివిధ పంటలకు నష్టం జరిగిందని, అయినా అధికారులెవరూ పంటలను పరిశీలించలేదని చె ప్పారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి నివేదిక రూపొందించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొందరు సభ్యులు కూడా ఇదే విషయా న్ని ప్రస్తావించడంతో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది.
నర్సంపేట నియోజకవర్గంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం డీడీల రూపంలో డబ్బు చెల్లించిన రైతులకు యంత్రాలు, ఇతర పరికరాలు అందించాలని జడ్పీటీసీలు పెద్ది స్వప్న, ఏ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా మంజూరు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా యంత్రాలు, ఇతర పరికరాలు పొందేందుకు రైతులు ఇటీవల డీడీల రూపంలో డబ్బు చెల్లించగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం అమలును ఆపేశారని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున వెంటనే యంత్రాలు, ఇతర పరికరాలు పంపిణీ చేయాలన్నారు. దీనికి జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్ సమాధానమిస్తూ ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలును పక్కన పెట్టాలని తమకు ఆదేశాలు అందినట్లు చెప్పారు.
రాయపర్తి మండలం మైలారంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఒక ఏఎన్ఎం పాల్గొని డ్యాన్స్ చేశారని రాయపర్తి జడ్పీటీసీ కుమారస్వామి ఆరోపించారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో వెంకటరమణ చెప్పారు. నడికూడ మండలం నార్లాపూర్లోని హెల్త్ సబ్సెంటర్కు తాళం వేసి, మూసి ఉంటుండడంతో వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నడికూడ ఎంపీపీ ఎం అనసూర్య అధికారుల దృష్టికి తెచ్చారు. కంఠాత్మకూరులో లీకేజీల వల్ల తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలువురు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో చాలామంది స్థానికంగా ఉండడం లేదని, సమయానికి విధులకు రా వడం లేదని, ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ పెద్ది స్వప్న, చెన్నారావుపేట ఎంపీపీ విజేందర్ డిమాండ్ చేశారు. పని దినాల్లో టీచర్లు రైళ్లు, బ స్సుల ద్వారా స్కూళ్లకు వచ్చిపోతున్నారని, ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కోల్పోతున్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఎంపీపీ విజేందర్ ఆరోపించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘జిల్లా బాస్గా మీరు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయకపోతే ఎలా?, జిల్లా కేంద్రం నుంచి కదలకపోతే స్కూళ్లు ఎలా నడుస్తాయి?’ అని డీఈవో వా సంతిని ప్రశ్నించారు. ‘ఫిర్యాదులపై విచారణ జరిపించండి, ప్రభుత్వ స్కూళ్లు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. విద్యాశాఖలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం అనర్హులను ఎంపిక చేస్తున్నారని సభ్యులు ఎండగట్టారు. పనిచేసే ఉపాధ్యాయులకు గాకుండా పనిచేయకుండా పై రవీ చేసుకునే టీచర్లకు అవార్డులొస్తున్నాయని వర్ధన్నపేట, పర్వతగిరి జడ్పీటీసీలు భిక్షపతి, సింగులాల్ ఆరోపించారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ బెస్ట్ టీచర్ అవార్డు కోసం అనర్హులను ఎంపిక చేస్తున్నారని, విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించేవారికే అవార్డు ఇస్తే వారిని ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారు. డీఈవో మాట్లాడుతూ బెస్ట్ టీచర్ అవార్డుకు ఉపాధ్యాయులను ఎంపిక చేయడంలో తన ప్రమేయం లేదని చెప్పారు.
కరెంటు సరఫరా విషయంలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ 200 యూనిట్ల వరకు ఉచితమని కాంగ్రెస్ పేర్కొందని, ఒకవేళ 250 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించుకున్న వినియోగదారులకు 200 మినహాయించి 50 యూనిట్లకు చార్జి వేస్తారా? ఎలా అమలు చేస్తారనే విషయమై స్పష్టత ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ జిల్లా అధికారిని కోరారు. వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి మాట్లాడుతూ వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరాపై జీవో వచ్చిందా? 24 గంటల కరెంటు ఇస్తున్నారా? లేదా? తెలపాలన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాట్లాడుతూ 200 యూనిట్ల విద్యుత్తుకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రాలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పర్వతగిరి జడ్పీటీసీ సింగులాల్, చెన్నారావుపేట ఎంపీపీ విజేందర్, రాయపర్తి ఎంపీపీ అనిమిరెడ్డికి మధ్య వాగ్వాదం తలెత్తడంతో జడ్పీ అధ్యక్షురాలు కలుగజేసుకొని శాంతింపజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, హామీల అమలుకు మూడు నెలల సమయం ఇస్తామని తెలిపారు.