నర్సింహులపేట, నవంబర్ 8: ఆయిల్పామ్ సాగు తో మంచి ఆదాయం వస్తుండడంతో రైతులకు ఆసక్తి పెరుగుతున్నది. మొక్కలు, బిందు సేద్యం పరికరాలు ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తుండడంతో ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 69,565ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు భూమి అనుకూలంగాఉంది. జిల్లాలో ఈ ఏడాది 6,710 ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా, ఇప్పటికే గత మూడేళ్లుగా 3,316 ఎకరాల్లో సాగైంది. ఇంకా ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2020-21లో 54మంది రైతులు 305 ఎకరాల్లో, 2021-22లో 128 మంది రైతులు 701ఎకరాల్లో, 2022-23లో అక్టోబర్ నెల వరకు 469 మంది రైతులు 2,200 ఎకరాల్లో మొక్కలు నాటారు. మొత్తం 3,316 ఎకరాల్లో సాగు చేశారు. 2023 జనవరి వరకు 2,310 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగే లక్ష్యంగా ఉద్యాన, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆయిల్పామ్ సాగు ఎకరానికి 57మొక్కల చొప్పున రైతులు నాటాలి. ఇలా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తే అన్ని ఎకరాల్లో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ఆయిల్పామ్ మొక్కకు రూ.193. కానీ, రైతులు రూ.20 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 4 ఏళ్లపాటు మొక్కల పెంపకం కోసం నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే చెల్లించడంతోపాటు బిందు సేద్యం పరికరాలకు సబ్సిడీ ఇస్తున్నది. ఇందుకోసం రైతులు టీఎస్ఎంఐపీ (TSMIP) ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ పత్రంతోపాటు రైతుల పాస్ఫొటో, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ ప్రతులను స్థానిక ఉద్యాన అధికారికి అందజేయాలి. ఆధార్ కార్డుకు రైతు మొబైల్ నంబర్ను జత చేయాలి.
సంప్రదించాల్సిన అధికారులు..
ఆయిల్పామ్ సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న మహబూబాబాద్, కొత్తగూడ, గంగారం రైతులు ఉద్యాన అధికారి విష్ణు సెల్ నంబర్ 7997725111, డోర్నక ల్, మరిపెడ, కురవి, చిన్నగూడురు రైతులు ఉద్యాన అధికారి వీ అనిత సెల్ నంబర్ 7997725110, తొ ర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, పెద్దవంగర, దం తాలపల్లి రైతులు ఉద్యాన అధికారి సీహెచ్ రాకేశ్ సెల్ నంబర్ 7997725109, కేసముద్రం, గూడూరు, బయ్యారం, గార్ల రైతులు ఉద్యాన అధికారి టీ అరుణ్ 7997725420 సెల్ నంబర్లకు సంప్రదించాలి.