సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చే శ్రీగంధం, ఎర్రచందనం సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. అడవుల్లో సాధారణంగా పెరిగే ఈ చెట్లకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ కలప జాతి మొక్కలు పెంచేందుకు అన్నదాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లలో శ్రీగంధం మొక్కలు పెంచుతూ వాటి పేరుతో ప్లాట్ల విక్రయిస్తుండడం విశేషం. కమలాపూర్ మండలంలో శనిగరం, ఉప్పల్, వంగపల్లి, గూనిపర్తి, నేరెళ్ల, కానిపర్తి, మర్రిపెల్లిగూడెం, భీంపల్లి గ్రామాల్లో సుమారు పది ఎకరాల్లో శ్రీగంధం, ఇరవై ఎకరాల్లో ఎర్రచందనం చెట్ల్లు పెంచుతున్నారు. శ్రీగంధం దీర్ఘకాలిక పంట అయినప్పటికీ సాగు చేయడం వల్ల రైతులకు లాభమే తప్ప నష్టం ఉండదంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు.
– కమలాపూర్, డిసెంబర్ 20
ఎకరన్నరలో ఎర్రచందనం పెంచుతున్నా..
వ్యవసాయ కూలీల కొరత ఉండడం వల్ల ఎర్రచందనం సాగును ఎంచుకున్నా. ఈ మొక్కల సాగును కడప జిల్లాలో చూశాను. మడికొండ ప్లాంటేషన్లో తీసుకొచ్చి ఎకరన్నర భూమిలో 600 మొక్కలు నాటాను. అందులో ఐదు వందలకు పైగా మొక్కలు దక్కాయి. 2005లో ఎర్రచందనం మొక్కలు నాటాను. ఇప్పటివరకు 17 ఏళ్లు అవుతుంది. ఎర్రచందనం ఏపుగా పెరిగి భారీ వృక్షాలు అవుతున్నయ్. 25ఏళ్లు దాటితేనే మార్కెటింగ్ ఉంటుందని చెబుతున్నరు. తెలంగాణ ప్రభుత్వం ఎర్రచందనం పెంచుతున్న రైతులను ఆదుకొని మార్కెటింగ్ అవకాశం కల్పించాలి.
– కోమాండ్ల సురేందర్రెడ్డి, రైతు, గూనిపర్తి