కొడకండ్ల, జూన్ 5 : ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతుండడంతో విసిగిపోయిన రైతులు శుక్రవారం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వానకాలం సమీపించిందని, వడ్లు ఇంకెప్పుడు కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వర్షం కురిస్తే చేతికొచ్చిన పంట ఆగమవుతుందన్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న వానలకు కొనుగోలు కేంద్రంలో నింపిన వడ్ల బస్తాలు తడిసిముద్దవుతున్నాయని అన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
సమాచారం అందుకున్న స్థానిక నాయకులు, అధికారులు చేరుకొని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. తాము పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో త్వరగా కొనుగోలు చేసి, తూకం వేసి వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళన చేస్తున్న రైతుల మధ్యే కూర్చొని ఫోన్లో జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. లక్ష్మకపల్లి కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం తరలింపునకు వెంటనే అదనపు లారీలను పంపాలని, కాంటాలు వేగవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలతో పంట నష్టపోకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.