మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, జయపురం, బాసుతండా, కొమ్ములవంచ, నర్సింహులపేట, గ్రామాలతో పాటు శివారు తండాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు. మిగతా పంటలకంటే కూరగాయాలతో ఎక్కువ లాభాలు వస్తున్న నేపథ్యంలో గతంకంటే ఈ సారి వీటిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. పండించిన కూరగాయలను నర్సింహులపేట, మరిపెడ, నెల్లికుదురు సంతలకు తీసుకెళ్లి సొంతంగా విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో ఒప్పందం చేసుకొని ఆయా చోట్లకు తరలిస్తూ లాభాలు పొందుతున్నారు.
– నర్సింహులపేట, మార్చి 9
పందిరి తోటల సాగు.. బహుబాగు
పలువురు రైతులు పందిరి తోటలను ఏర్పాటు చేసుకొని మంచి ఫలితాలు పొందుతున్నారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, జాబ్కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్లతో ఉపాధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తప్పనిసరిగా నీటి వసతి కలిగిన బావి, బోరు మోటర్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రైతుల వ్యవసాయ క్షేత్రాన్ని అధికారులు పరిశీలిస్తారు. సదరు రైతు ముందస్తుగా రాతి ఖనీలు, ఐదు క్వీంటాళ్ల ఇనుప తీగ వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసుకుంటే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై డ్రిప్, మల్చింగ్ అందిస్తారు. కూరగాయాల సాగు మొదలైన తర్వాత ఖాతాలో రూ.లక్షా20వేలు జమ చేస్తారు.
మంచి ఆదాయం
కూరగాయల సాగుతో ఇతర పంటల కుంటే డబ్బులు ఎక్కువే మిగులుతున్నాయి. గతేడాది టామాటా ధర కిలో రూ.80 నుంచి 100 దాకా అమ్మినం. అప్పుడు అన్ని ఖర్చులు పోను 15 గుంటలకు రూ.లక్ష మిగిలింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు టామాటా వేసి అమ్మినం. ఇప్పుడు 15 గుంటల్లో మళ్లీ కాతకు వచ్చింది. మరో అరెకరంలో టామాటా నాటు వేసిన.
-జాటోతు సీతారాములు, ఎర్ర చకృతండా
తక్కువ నీరే అవసరం
కూరగాయల సాగుకు నీరు తక్కువ అవసరం పడుతుంది. ఇతర పంటలతో పోలిస్తే ఖర్చు కూడా తక్కువే. కొన్ని రకాల కూరగాయల ధరలు మార్కెట్లో కొన్ని సమయల్లో పడిపోయి నష్టపోతం. డిమాండ్ను తెలుసుకుంట పంటలు వేసుకుంటే లాభాలు వస్తయ్. ఇతర పంటలకంటే కూరగాయల సాగు ఎంతో మేలు.
– బానోతు వీరన్న భీమ్లాతండా