వరంగల్, అక్టోబర్ 1 : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన కేటీఆర్ పర్యటనపై ప్రభుత్వ శాఖల అధికారులతో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ నెల 6న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల పరిధిలో పలు అభివృద్ధ్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. వాటికి సంబంధించిన శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో మంత్రి కేటీఆర్ ఉదయం పర్యటిస్తారని, అనంతరం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో భారీ స్థాయిలో నిర్వహించే సంక్షేమ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఈ సంక్షేమ సభకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో వస్తుందన్నారు. సమస్యలు తలెత్తకుండా పోలీసులు బారీ బందోబస్తు చేపట్టాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ మహేందర్జీ, డీసీపీ బారీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.