ఖిలావరంగల్, ఫిబ్రవరి 12 : పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్ పరీక్షలకు 26 కేంద్రాల్లో 12,620 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. అలాగే, పదో తరగతిలో 54 సెంటర్లలో 9455 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారని వెల్లడించారు. దూ ర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. తాగునీటి వసతి, పరిశుభ్రత నిర్వహణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను పోలీసు బందోబస్తు ద్వారా పరీక్ష సెంటర్లు, పరీక్ష ముగిసిన తర్వాత పోస్టల్ శాఖకు జవాబు పత్రాలను సీల్ చేసి పకడ్బందీగా ఏర్పాట్లతో తరలించాలని సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్, ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించాలని, జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఐవో కాక మాధవరావు, డీఈవో వాసంతి పాల్గొన్నారు.
హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో హరితహారం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. 2023లో లక్ష్యం మేరకు 25.95 లక్షలు మొకలు నాటామన్నారు. 2024లో నిర్దేశించిన 25.85 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, 2025కు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎఫ్వో అర్పన, డీపీవో కల్పన పాల్గొన్నారు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ట్రైనింగ్ కోసం వచ్చిన కేంద్ర ప్రభుత్వ సెక్షన్ ఆఫీసర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 6 నుంచి 13 వరకు రెండు బృందాలు రాయపర్తి, పర్వతగిరి, దుగ్గొండి, గీసుగొండ మండలాల్లో పర్యటించి ఉపాధిహామీ, పీఎం పోషణ అభియాన్, రైతుబంధు, హరితహారం తదితర పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఈ మేరకు అభివృద్ధి పథకాల తీరుతెన్నులను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్, డీఆర్డీవో సంపత్రావు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వరంగల్ యూనిట్ మేనేజర్ కుమారస్వామి పాల్గొన్నారు.