హుస్నాబాద్, నవంబర్ 29 : హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది, అధికారులు గ్రామాలకు తరలివెళ్లారు. బుధవారం హుస్నాబాద్లోని టీఎస్ మోడల్ స్కూ ల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉద యం నుంచి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. అధికారులు, సిబ్బంది, పోలీసులతో మోడల్ స్కూల్ ఆవరణ సందడిగా మారింది. మధ్యాహ్నం వరకు పంపిణీ కార్యక్రమం పూర్తి కాగా పీవోలు, ఏపీవో, ఓపీవోలు, పోలీసు సిబ్బంది ఎన్నికల సామగ్రితో వివిధ వాహనాల్లో వారివారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. నియోజకవర్గంలోని 304పోలింగ్ స్టేషన్లు ఉండగా, పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 1,400మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు ఆర్వో బెన్ షాలోమ్ తెలిపారు. వీరితోపాటు 32మంది రూట్ ఆఫీసర్లు, 138 మంది మైక్రో అబ్జర్వర్లు, 32సెక్టార్లలో విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 304పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,42,177 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,19,757మంది పురుషులు, 1,22,416మంది మహిళలు, ఇతరులు నలుగురు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది గురువారం ఉదయం నుంచి జరుగనున్న పోలింగ్కు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆయా పోలింగ్కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు నిఘా ఉంచారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పోలీసు అబ్జర్వర్ సోనమ్ టెన్సింగ్ భూటియా సందర్శించారు. భద్రతా చర్యలపై స్థానిక ఏసీపీ సతీశ్తో చర్చించారు. అన్నిపోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు ఉంచామని ఏసీపీ తెలిపారు.
హుస్నాబాద్ టౌన్, నవంబర్ 29 : గత అసెంబ్లీ ఎన్నికలకంటే ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఎన్నికల అధికారులు పెంచారు. పట్టణంలో గతంలో 17పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఈ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను 18కి పెంచారు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో 18,118మంది ఓటర్లు ఉండగా, 8,872మంది పురుషులు, 9244మంది మహిళా ఓటర్లతోపాటు ఇతరులు ఇద్దరు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణంలో 6నుంచి 22 వరకు పోలింగ్ బూత్ల సంఖ్య ఉండగా, ఈ ఎన్నికల్లో 23వ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. ఆరపల్లిలోని మహిళా రీడింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పోలింగ్ బూత్ల సంఖ్య 18కి చేరింది. గతంలో 9,10,11 పోలింగ్ బూత్లను ఆరపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించగా, ఇందులో 9వ పోలింగ్ బూత్ను మహిళా రీడింగ్ కేంద్రానికి ఎన్నికల అధికారులు మార్చారు. 11వ పోలింగ్ బూత్ను ఆరపల్లి మహిళా రీడింగ్ కేంద్రానికి మార్చాల్సి ఉండగా, 9వ బూత్ను అధికారులు మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భీమదేవరపల్లి, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జరుగనున్న పోలింగ్కు మండలంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో 22 గ్రామాలు ఉండగా, 25 పోలింగ్ కేంద్రాలు, 46 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు పోలింగ్ సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలో 37,616 మంది ఓటర్లు ఉండగా, అందులో 18,552 పురుషులు, 19,064 మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటభాస్కర్ చెప్పారు.
ఎల్కతుర్తి: మండలవ్యాప్తంగా 30,543 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 15,179 మంది, మహిళలు 15,364 మంది ఉన్నారు. 39 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. కాజీపేట ఏసీపీతోపాటు ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మంది బీఎస్ఎఫ్, ఇతర విభాగాల సిబ్బందిని అధికారులు నియమించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు అదనపు బలగాలను కేటాయించినట్లు ఎస్సై గోదారి రాజ్కుమార్ తెలిపారు.