వరంగల్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): శాసనసభ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతం, సజావుగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించారు. మహిళలు, యువత, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రితో పోలింగ్ అధికారులు, సిబ్బంది బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం పోలింగ్ నిర్వహణ కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో నిబంధనలకనుగుణంగా సన్నాహాలు చేశారు. 29 మంది అభ్యర్థులు తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పోటీలో ఉన్నారు. నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వరంగల్తూర్పు నియోజకవర్గంలో 2,54,641 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,24,493, మహిళలు 1,29,810, ఇతరులు 338 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరితోపాటు సర్వీసు ఓటర్లు 85, ఎన్నారై ఓటర్లు 25 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లలో పురుషులు 82 మంది, మహిళలు ముగ్గురు, ఎన్నారై ఓటర్లలో పురుషులు 19, మహిళలు ఆరుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో మహిళలే ఎక్కువ మంది ఉండడం విశేషం.
పోలింగ్ నిర్వహణ కోసం తూర్పు నియోజకవర్గం పరిధిలో 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. 89 లొకేషన్లలో ఈ పోలింగ్ కేంద్రాలు పనిచేస్తాయని వెల్లడించారు. 230 పోలింగ్ కేంద్రాల్లో 57 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, వీటితో సహా 230 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేసినట్లు వివరించారు. ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రంతోపాటు మూడు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రతి లొకేషన్లో బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయని తెలిపారు. 230 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు 21 సెక్టార్లుగా గుర్తించారు. 17 రూట్ల ద్వారా పోలింగ్ పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. 1,056 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది నియమితులయ్యారు. వీరిలో ప్రిసైడింగ్ అధికారులు 264, అసిస్టెంటు ప్రిసైడింగ్ అధికారులు 264, ఇతర ప్రిసైడింగ్ అధికారులు 528 మంది ఉన్నారు. వీరికి పోలింగ్ నిర్వహణపై ఎన్నికల అధికారులు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ నిర్వహణ కోసం 110 మంది మైక్రో అబ్జర్వర్లు నియమితులయ్యారు. 29 మంది పోటీలో ఉండడం వల్ల ఈ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు రెండో ఈవీఎం ఏర్పాటుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగనుంది. పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల అధికారులు బుధవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాముల వద్ద బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు అందజేశారు. రవాణా కోసం బస్సులు, కార్లను కూడా సమకూర్చడంతో పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో నియోజకవర్గంలోని 230 పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేశారు.
తూర్పు నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులు, మోడల్ కోసం ప్రత్యేకంగా పన్నెండు పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దారు. ఎల్బీనగర్లోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ, లర్నర్స్ లాండ్ హైస్కూల్, గిర్మాజిపేటలోని ప్రభుత్వ ఎయిడెడ్ వివేకానంద జూనియర్ కాలేజీ, వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, అబ్బనికుంటలోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్లో ఒక్కో ఆదర్శ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. వీటితోపాటు మహిళల కోసం కొత్తవాడలోని గోల్డెన్ ఓక్ స్కూల్, మండిబజార్లోని కిడ్డికూప్ స్కూల్, గిర్మాజిపేటలోని ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్, ఉర్సులోని ప్రభుత్వ ఎయిడెడ్ శ్రీవెంకటేశ్వర హైస్కూల్, శంభునిపేటలోని ప్రభుత్వ హైస్కూల్లో మహిళా పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు. కరీమాబాద్లోని కౌటిల్య హైస్కూల్లో దివ్యాంగులు, దేశాయిపేటలోని సీకేఎం అండ్ సైన్స్ కాలేజీలో యూత్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, మహిళలు, దివ్యాంగులు, యువతకు బెలూన్లు సహా భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.