హనుమకొండ, మార్చి 26: ఓటుహకు కలిగిన ప్రతి ఒకరూ మే 13న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ములుగురోడ్డు సమీపంలోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి అన్వేశ్ చింతల అధ్యక్షతన మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్-2024 కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, ఓయూ ప్రొఫెసర్ పి.నవీన్కుమార్, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు, ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ, డీహెచ్రావు, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మీరమాకాంత్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. సిబ్బందికి ఈ నెల 31న, ఏప్రిల్ 1, 2వ తేదీల్లో హనుమకొండలోని కేడీసీ, పరకాలలోని పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వేసవి దృష్ట్యా నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో తాగునీటి సరఫరాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్, వార్షిక నిర్వహణపై గ్రేటర్ వరంగల్ మున్సిప ల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. కార్పొరేషన్ పరిధిలో అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తాగునీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధికాగుప్తా, వెంకట్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డీవో నాగ పద్మజ, డీసీఎస్వో వసంతలక్ష్మి, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం మహేందర్, అగ్రికల్చర్ జేడీ రవీందర్ సింగ్, డీసీవో నాగేశ్వర్రావు పాల్గొన్నారు.