సరదాల సంక్రాంతిని సంబురంగా జరుపుకొనేందుకు అందరూ సిద్ధమయ్యారు. రంగవల్లులతో వాకిళ్లన్నీ పులకరించనుండగా, పసుపు కుంకుమ పులుముకున్న గొబ్బెమ్మలు ముచ్చట గొలుపనున్నాయి. సకల సౌభాగ్యాలు కలగాలని నోచే నోములు, తీరొక్క బొమ్మల కొలువులతో సోమవారం ఇంటింటా సందడి నెలకొననుండగా, గంగిరెద్దుల విన్యాసాలు, ఆకాశాన పతంగుల విహారాలు ఆకట్టుకోనున్నాయి.
– నమస్తే నెట్వర్క్
Sankranti | ధనుర్మాసం ముగిసి, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. భానుడు దక్షిణాయనం చాలించి, ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సంక్రాంతి పర్వదినాన్ని సోమవారం ఘనంగా జరుపుకోనున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో దేవతలు దివి నుంచి భువికి వస్తారని ఆ సమయంలో అలంకరణ ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని నమ్ముతారు. శివుడి వాహనం నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలో ప్రవేశించడాన్ని శుభసూచకంగా భావిస్తారు. హరిదాసును విష్ణుస్వరూపంగా భావించి ధాన్యాన్ని దానంగా సమర్పిస్తారు.
హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చిన్నాపెద్దలను ఆకట్టుకుంటాయి. అలాగే సంక్రాంతికి ఇంటింటా చిన్నారులు బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. మహిళలు నోములు నోచుకుని ముత్తయిదువులను పిలిచి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. బెల్లం, నువ్వులు ప్రసాదాలుగా పంచిపెడుతారు. అలాగే సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది.
చిన్నాపెద్దా గాలిపటాలు ఎగురవేస్తూ సరదా తీర్చుకుంటారు. పలుచోట్ల పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు. పండుగ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఐనవోలు మల్లన్న, కొత్తకొండ వీరన్న జాతరలు జోరుగా సాగుతాయి. రైతులు పశువులను శుభ్రంగా కడిగి, ఎడ్లబండ్లను అలంకరించి, ఇంటిల్లిపాది కలిసి జాతరకు, ఆలయాలకు వెళ్తారు.
సంక్రాంతి తర్వాతి రోజును కనుము పండుగగా జరుపుకొంటారు. దీనినే పశువులను పూజించే పండుగ అంటారు. ‘కనుము’ అంటే పశువు అని అర్థం. మన గాదెలన్నింటినీ ధాన్యంతో నింపడంలో తోడ్పడేవి పశువులే. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని గాదెలకు చేర్చే వరకు శ్రమించిన పశువులను ఆరాధించడమే కనుమ పండుగలోని పరమార్థం. ఈ రోజున పశువులను కడిగి పసుపు, కుంకుమను కొమ్ములకు అలంకరించి ముఖానికి బొట్టు పెట్టి ఊరేగిస్తారు. అలాగే, కనుమ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు.