వర్ధన్నపేట, నవంబర్ 12: తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకూ రైతుల పక్షాన నిలబడి టీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. ధాన్యాన్ని కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ నేతృత్వంలో శుక్రవారం రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు హాజరయ్యారు. వివేకానంద సెంటర్లో జరిగిన ధర్నాలో ఎర్రబెల్లి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోని ఆదర్శంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందిస్తున్నారన్నారు. కానీ, కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయమని మొండివైఖరి ప్రదర్శిస్తుండడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. పంజాబ్లో కేంద్రం పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణలో ఎందుకు నిరాకరిస్తున్నదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, వర్ధన్నపేటలో జరిగిన ధర్నాకు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రైతుల నడ్డి విరుస్తున్న కేంద్రం
రాయపర్తి: దేశానికి అన్నం పెడుతున్న రైతాంగం నడ్డి విరువడమే లక్ష్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పని చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలకేంద్రంలోని రాజీవ్చౌరస్తాలో శుక్రవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ అధ్యక్షతన ధాన్యం కొనుగోళ్లు-పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణను కోరుతూ టీఆర్ఎస్ మండల కమిటీ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం లేదన్నారు. వచ్చే యాసంగిలో రాష్ట్రంలోని రైతాంగం పండించే వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కేంద్రం బేషరతుగా కొనుగోలు చేస్తామని ప్రకటించే వరకూ తమ పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. మండలంలోని 39 గ్రామాల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు రాజీవ్చౌరస్తా నుంచి భారీ ర్యాలీ తీశారు. అనంతరం తాసిల్దార్ కుసుమ సత్యనారాయణకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అనుమాండ్ల దేవేందర్రెడ్డి, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, మండల నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిందే..
వరంగల్ చౌరస్తా: తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలని మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు అన్నారు. వరంగల్ చౌరస్తాలో శుక్రవారం టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుధర్నాలో వారు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతును ఇబ్బంది పెట్టిన ఏ రాజకీయ పార్టీ దేశంలో తన మనుగడ కొనసాగించలేదని వారు అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కొల్లూరి యోగానంద్, డాక్టర్ హరిరమాదేవి, తాబేటి వెంకట్గౌడ్, మాజీ కార్పొరేటర్ చింతం యాదగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, హనుమకొండ జిల్లాలోని హనుమకొండ చౌరస్తా నుంచి ఏకశిల పార్కు వరకూ నిర్వహించిన రైతుధర్నా ర్యాలీకి వరంగల్ 29వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.