మరిపెడ, జూన్ 23 : ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి కుటుంబం అండగా నిలువాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కోరారు. శుక్రవారం మరిపెడ మండలంలోని అనేపురం, వెంకట్యాతండా, యలమంచిలితండాలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అందజేయాలన్నారు. నాడు గొల్ల కురుమలు, మత్య్స, చేనేత, నాయీబ్రహ్మణ, రజక తదితర కులవృత్తిదారులకు గ్రామాల్లో ఉపాధి కరువై పట్టణాల్లో వలసకు వెళ్లిన దుస్థితి ఉండేదన్నారు. సాగు నీళ్లు లేక, కరెంట్ కోతలతో తెలంగాణ రైతులు అరిగోస పడ్డారని అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సుభిక్షమైన పాలన అందజేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మన ఊరు – మన బడి ద్వారా సకల సౌకర్యాలతో విద్యార్థులకు విద్యనందిస్తున్నట్లు చెప్పారు.
రైతులకు రెండు పంటలకు సాగునీళ్లు, ఉచిత కరెంట్, రైతుబంధు పథకంతో అండగా ఉంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 ఉన్న పింఛన్లను బీఆర్ఎస్ రూ.2వేలకు పెంచిందని, దివ్యాంగులకు రూ.4,116 అందజేస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం ద్వారా దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 500 జనాభా కలిగిన 3,200 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు స్వయం పాలన అందజేసినట్లు చెప్పారు. డోర్నకల్ నియోజకవర్గంలో అనునిత్యం ప్రజలకు సేవ చేసేందుకు మారుమూల తండాలో తాను నివాసముంటున్నట్లు తెలిపారు. డోర్నకల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని, స్థానికేతరులకు ఇక్కడ అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, ఎంపీపీ గుగులోత్ అరుణారాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదారవీంద్రనాయక్, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మహేందర్రెడ్డి, సర్పంచ్లు దామెర వెంకన్న, సూర్యనాయక్, కృష్ణ, హరీశ్ పాల్గొన్నారు.