హనుమకొండ, ఏఫ్రిల్ 5: కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రశ్నాపత్రాల లీకేజీల కుట్రలో ఒక రాజకీయ పార్టీ ప్రమే యం ఉండడం దురదృష్టకరం.. అత్యంత బాధాకరం.. అన్నారు. అందులోనూ బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీకి చెందిన సంస్థల సభ్యులుండటం మరీ అత్యంత దారుణం అన్నారు. ప్రశ్న పత్రాల లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నది.. ఈ కుట్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండటం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎర్రబెల్లి మండిపడ్డారు. కొద్దిరోజుల ముందే నుంచి పథకం పన్నుతూ ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెంది బీజేపీ ట్రాప్లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంధ సంస్థలు బీజేపీ చేస్తున్న కుట్రలను విశ్లేషించాలని ఆయన కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆధారాలతో దొరికాడన్నారు. పోలీసులు తమదైన పద్ధతిలో లీకేజీలను ఛేదించడంతో పాటు కుట్రను బయటకి తీస్తున్నారని తెలిపారు.
లీకేజీలు ఒక పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని ఎర్రబెల్లి తెలిపారు. కమాలపుర్లో జరిగిన తాజా లీకేజీని బట్టి ఈ విషయం మరోసారి తేటతెల్లమైందన్నారు. బండి సంజయ్ ఒక రోజు ముందే కుట్ర పన్ని లీకేజీగా సృష్టించారన్నారు. బండి ఫోన్ లేదనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఫోన్ ఇస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపారన్నారు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏమిటన్నారు. కనీసం విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం లేదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడరని, ఇలాంటి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలను తట్టుకొని చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణను తెర్లు కానివ్వరన్నారు. మా రాష్ట్రాన్ని, మా ప్రజలను, మా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందన్న మంత్రి ఎర్రబెల్లి మొన్నటికి మొన్న శ్రీరామ నవమి రోజు మత చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది..తాజాగా ప్రశ్నపత్రాల లీకేజీ… ఇలా వరుసగా జరుగుతున్న ఈ కుట్రలన్నింటినీ అపర చాణుక్యుడు సీఎం కేసీఆర్ ఛేదిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణను తెచ్చిన సీఎం కేసీఆర్, రాష్ర్టాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా పోరాడుతారని పేర్కొన్నారు. మేము కేసీఆర్ వెంట ఉన్నాం.. ప్రజలంతా మా వెంటే ఉన్నారు.. మా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు.. మా పాలన ఎలా చేసుకోవాలో మాకు తెలుసు.. మా పరీక్షలు ఎలా నిర్వహించుకోవాలో, మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా ఇచ్చుకోవాలో కూడా మాకు తెలుసని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ ఉద్యోగాలు ఇవ్వదు. కానీ, ఉద్యోగాలు ఇస్తున్న తెలంగాణ కాళ్లల్లో కట్టె బెడతదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వదు, అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకుంటుంది.. ఇదంతా చూస్తూ ఊరుకోడానికి మేమేమి చేతులు ముడుచుకొని కూర్చోలేదన్నారు. లీకేజీలకు బీజేపీ పకడ్బందీ ప్రణాళలు రూపొందించిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ పోలీసులు సమర్థులు. ఇలాంటి సమస్యలు తేల్చేస్తారన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దోషులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తుందని, ఇలాంటి ఎన్ని కుట్రలనైనా ఛేదిస్తాం మమ్మల్ని మేం కాపాడుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం ఈ కేసులో ఏ-1గా ఉన్న బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు ఏ-2 గా ఉన్న ప్రశాంత్ బీజేపీ సంస్థ ‘నమో’ పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ అని ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కౌంట్డౌన్ ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. అపర చాణుక్యుడు, మేధావి సీఎం కేసీఆర్ ముందు బీజేపీ కుట్రలు, కుతంత్రాలు నడువవన్నారు. సీఎం కేసీఆర్ అంటే మోదీ, అమితాషాకు వణుకు పుడుతుందని, దాంతోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. దగాపడ్డ రైతాంగం, సంఘటిత, అసంఘటిత కార్మిక లోకంతో పాటు దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలని కుట్రలు చేస్తున్నదన్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా కేసీఆర్ తెలంగాణ సాధించి అంబేద్కర్ ఆశయాల మేరకు పాలన చేస్తున్నారన్నారు. యువతకు చదువు వద్దు బీజేపీలో చేరండి అని బండి సంజయ్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ప్రణాళిక ప్రకారం లీకేజీలను బీజేపీ చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ స్పీడ్ను ఎవరూ ఆపలేరని, బీజేపీకి ఇకపై గడ్డుకాలమేనన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు చెప్పులతో గుణపాఠం చెపుతారన్నారు.
ఎన్నికల కోసమే బీజేపీ పార్టీ లీకేజీల కుట్రను తీసుకొస్తున్నదని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రం నుంచి మొదలుకొని రెండు రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ర్టాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఆయా రాష్ర్టాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారన్నారు. టీఎస్పీఎస్ పేపర్ లీక్లో బీజేపీ కార్యకర్త రాజశేఖర్రెడ్డి ఉన్నట్లు సిట్ స్పష్టం చేసిందన్నారు. తాజాగా 10వ తరగతి పేపర్లే లీక్ చేసింది కూడా బండి సంజయ్, అతడి అనుచరులు బీజేపీ కార్యకర్తలేనన్నారు. రాష్ట్రంలో ఒక వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే బీజేపీ కోర్టులకు వెళ్లి అడ్డుకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు. ఖబర్దార్ బండి సంజయ్.. తెలంగాణ ప్రజలు, యువత తిరుగబడే రోజలు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.