కాశీబుగ్గ, ఫిబ్రవరి 5 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు సోమవారం రికార్డు స్థాయిలో 30,918 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా సోమవారం అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్లో ఎటుచూసినా ఎర్రబంగారం బస్తాలతో కళకళలాడింది. సీజన్ ప్రారంభంలో నామమాత్రంగా రోజుకు రెండు వేల నుంచి 10వేల బస్తాల వరకు వచ్చేవి. సంక్రాంతి పండుగ తర్వాత మార్కెట్కు మిర్చి బస్తాల రాక పెరిగింది. జనవరి 19న అత్యధికంగా 25వేల బస్తాలు వచ్చాయి. సోమవారం 30,918 లకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు మాత్రం ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగానే ఉంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు దడువాయి, గుమా స్తా, హమాలీ, ఇతర కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు చేతి నిండా పని దొరుకుతుందని కార్మికులు సంబురపడుతున్నారు. ఇప్పటివరకు మార్కెట్కు లక్షా 81వేల క్వింటాళ్ల మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. వీటిలో తేజ రకం అత్యధికంగా క్వింటాల్కు రూ.21,100, కనిష్టంగా రూ.14,500, వండర్హాట్ అత్యధికంగా రూ.20,500, కనిష్టంగా 14,500, యుఎస్-341 రూ.20వేలు, కనిష్టంగా 14వేలు, తాలు రకం మిర్చి రూ.8500, కనిష్టంగా రూ.5వేలు ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు.
కాశీబుగ్గ, ఫిబ్రవరి 5: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డులను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్తోపాటు జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజునాయక్, డీఎంవో పాలకుర్తి ప్రసాద్రావు, కార్యదర్శి క్యారం సంగయ్య సమావేశమయ్యారు. మార్కెట్ పరిధిలో జరుగుతున్న క్రయవిక్రయాల తీరు, రైతుల సమస్యలు, అడ్తి, ఖరీదు లైసెన్స్ల రెన్యువల్స్, వేమెంట్స్, సిబ్బంది పనితీరుపై చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.