వరంగల్, నవంబర్ 28 : పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే వరంగల్ తూర్పు నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ఘనత సీఎం కేసీ ఆర్దేనని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. కేఎంసీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. నియోజవర్గంలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1200 కోట్లతో 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో అందే వైద్య సేవలు త్వరలోనే ఇక్కడ అందుబాటులోకి రానున్నాయన్నారు. సీకేఎం కళాశాలను ప్రభుత్వ పరం చేసి కేజీ టూ పీజీ విద్యను పేదలకు అందజేస్తున్నార న్నారు. నియోజకవర్గంలో 7 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజవర్గంలోని పేదల ఉపాధి కోసం వరంగల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.
ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. వరంగల్లోని ఆజంజాహీ మిల్లును కాంగ్రెస్ పాలకులు అమ్ముకుని 6 వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో వరంగల్ ప్రాంతంలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో వందేళ్ల అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. తూర్పులో 57 వేల మంది మైనార్టీలు ఉన్నారని, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన సీఎం కేసీఆర్ను కోరారు. పేదలు ఎక్కువగా నివసించే వరంగల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాది కల్పించాలని అన్నారు. కాకతీయ సామ్రాజ్య నగరి అయిన వరంగల్ను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలన్నారు.