కొడకండ్ల/పాలకుర్తి రూరల్, జనవరి 24: మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, దేశంలోనే తెలంగాణ మహిళలు ఆదర్శం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇందు కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, మహిళల అభివృద్ధి లక్ష్యంగా సెర్ప్, స్త్రీనిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలోనే కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మండలకేంద్రంలోని వెంకటేశ్వర సమాఖ్యలో కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ పసునూరి మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాలకుర్తిలో రూ. 5 కోట్లతో 3 వేల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. సంఘంగా కాకుండా వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు 30 రోజులు ఈ కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించామన్నారు. ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సమైక్య పాలనలో మహిళలకు రూ. 4 వేల కోట్ల రుణాలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 18 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. ఈ పథకం కింద మహిళలకు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇస్తామని సీఎంకు చెబితే దీవించారన్నారు. సంగెం మండలంలో టెక్స్టైల్ పార్కుకు 10 వేల మంది అవసరముందని, కొడకండ్లలో కూడా మినీ టెక్స్టైల్ పార్కు వస్తుందన్నారు. వీటి వల్ల మహిళలకు ఉపాధి, ఉద్యోగం లభిస్తుందని వివరించారు. ఇది కంటిన్యూగా జరిగే శిక్షణ కార్యక్రమం అని స్పష్టం చేశారు. ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం సెర్ప్ నుంచి రూ.10 వేలు, స్త్రీ నిధి నుంచి రూ.7 వేల చొప్పున ఒకరిపై రూ.17 వేల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పరంగా దుస్తుల ఆర్డర్ ఇచ్చినా మనకే వచ్చేలా చేస్తానని భరోసా ఇచ్చారు. తరువాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అమలయ్యే పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
కవులకు పుట్టినిల్లు.. పాలకుర్తి గడ్డ..
పాలకుర్తి గడ్డ కవులకు పుట్టినిల్లు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని చెన్నూరులో ఐకేపీ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ పథకం బాగుందని సీఎం కేసీఆర్ ప్రశంసించారని చెప్పారు. బమ్మెర పోతన, పాల్కూరికి సోమనాథుడు, వాల్మీకి పుట్టిన గడ్డ అన్నారు. పోతన, వాల్మీకి విగ్రహాలను నెలకొల్పుతామన్నారు. రూ.25 కోట్లతో హరిత హోటల్ను పాలకుర్తిలో నిర్మిస్తున్నామన్నారు.
కొడకండ్ల నుంచి సోలార్ పథకం
మొదటగా ఇంటింటికీ సోలార్ ద్వారా కరెంట్ వినియోగం కోసం రుణాలు మంజూరు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సోలార్ పెట్టేందుకు ఇంటికి రూ. 1.42 లక్షల ఖర్చులో రూ. 40 వేల సబ్సిడీ వస్తుందన్నారు. స్త్రీనిధి నుంచి రూ. లక్ష రుణం ఇవ్వగా లబ్ధిదారుడు రూ. 3 వేలు భరించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కొడకండ్ల నుంచి సోలార్ పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు.