గిర్మాజీపేట, డిసెంబర్ 7: ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం జాయింట్ సీఈవో రవికిరణ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మర్ రివిజన్-2023పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు.
18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలన్నారు. పేర్లు తొలగించే విధానంలో బీఎల్వోలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులు విధిగా తమ పేర్లు, మొబైల్ నంబర్లను పోలింగ్ బూత్ల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఈఎస్ఐ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో మొత్తం 6,99,894 మంది ఓటర్లు ఉండగా, 4,66,306 మంది 6బీ ఫారంలు తీసుకున్నట్లు వెల్లడించారు. స్వీప్ యాక్టీవిటీస్ ద్వారా ఆర్ఈడీ ఎఫ్ఎం బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రచారం చేసినట్లు వివరించారు. ప్రధాన కూడళ్లలో డిస్లేలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు. సమీక్షలు స్వీప్ నోడల్ అధికారి నర్సింహమూర్తి, ఎలక్షన్ డ్యూటీ తహసీల్దార్ శుభానొద్దీన్ పాల్గొన్నారు.