ధర్మసాగర్, అక్టోబర్ 7 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు మోసపూరితమైనవి, ప్రజలు వాటిని నమ్మకూడదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ఘన్పూర్ నియోజవకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని పెద్దపెండ్యాల, నారాయణగిరి, ముప్పారం, సోమదేవరపల్లె, దేవునూర్, రాపాకపల్లె గ్రామాల కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. అతిథిగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయని తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని ఆరు హామీలను ఇస్తోందన్నారు.
అధికారం కోసమే ఆ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలందరినీ ఏకం చేసి కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ముందుగా రాష్ట్రం ఇస్తే తెలంగాణలో 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకునే వారు కాదన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉండేదని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో విద్యుత్ కోసం ఎక్కడా కూడ రైతులు ధర్నాలు చేయలేదని గుర్తు చేశారు. రైతును రాజు చేయడం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను నిర్మించి నీరు అందించామన్నారు. కాళేశ్వరం, గోదావరి ఎత్తిపోత్తల ప్రాజెక్టును పూర్తి చేసి, గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపి రైతులకు నీరు అందించామన్నారు. గ్రామాల్లో సమృద్ధిగా పంటలు పండుతున్నాయన్నారు. ఒకప్పుడు వరి సాగులో హార్యాన, మహారాష్ట్రం, పంజాబ్ రాష్ర్టాలు ముందు ఉండేవని, నేడు దేశం గర్వించేలా వరి పంట సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుకు గిట్టుబాటు ధర కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయిన వారికి కేసీఆర్ కిట్ పథకం అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తనను ఆశీర్వదించి మీ ముందుకు పంపారని కడియం శ్రీహరి అన్నారు. నిండు మనసుతో తనను ఆశీర్వాదించాలని కోరారు. గెలిచిన ఆరు నెలల్లోనే మీకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎలాంటి తలవంపులు వచ్చే పనిని చేయనన్నారు. ప్రజలు తల ఎత్తుకునేలా తన పనితనం ఉంటుందన్నారు.
అంతే కాకుండా సంక్షేమ పథకాలు అర్హులైన వారికే అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకానికి నిజమైన లబ్ధిదారులను గుర్తించి, మధ్యవర్తిత్వం లేకుండా, పైసా ఖర్చు లేకుండా అందేలా చూస్తానన్నారు. అంతే కాకుండా నియోజకవర్గానికి గృహలక్ష్మి పథకంలో 3000 ఇండ్లు మంజూరయ్యాయని, సీఎం కేసీఆర్తో స్వయంగా మాట్లాడి మరో మూడు వేలు కలిపి మొత్తంగా ఆరు వేల ఇండ్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. వీటిని నిజమైన లబ్ధిదారులకు అందజేస్తానని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లాభం కోసం పని చేయనని తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేవారికి పదవులు వస్తాయన్నారు. నిండు మనసుతో తనను ఆశీర్వాదించాలని కోరారు. ఈ సందర్భంగా నారాయణగిరి గ్రామానికి చెందిన బీజేపీ వార్డు సభ్యుడు ముక్కెర రవి, దేవునూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ చింత మధు, మాజీ సర్పంచ్ పోడిశెట్టి స్వామి, బీజేపీకి చెందిన చిరంజీవి, రాజేందర్, సదానందం, రవీందర్, రవితోపాటు పలు గ్రామాలకు చెందిన 50 మంది కడియం శ్రీహరి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ మండల మునిగెల రాజు, ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి, జడ్పీటిసీ డాక్టర్ పిట్టల శ్రీలత, వైస్ ఎంపీపీ రవీందర్, వైస్ చైర్మన్ యాదకుమార్, సర్పంచ్లు ఆకారపు అన్నమ్మ, గొనెల సమ్మక్క, తోట మంజుల, చిర్ర కవిత, కందుకూరి విజయ, ఎంపీటీసీలు ఆకారపు నాగయ్య, వల్లపురెడ్డి రమాదేవి, లక్క సునీత, శోభ, మాజీ ఎంపీపీలు యాదగిరి, రాజుగారి రఘు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుడివెనుక దేవేందర్ పాల్గొన్నారు.