వరంగల్, మార్చి 4: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో వందశాతం పన్నుల వసూళ్లకు కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఆమె పన్నుల వసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి 26 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటి వరకు 60 శాతం పన్నులు వసూలయ్యాయని, మిగతా 40 శాతం గడువులోగా వసూలు చేయాలని సూచించారు. వందశాతం పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమన్నారు. సమీక్షలో డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రశీద్, జోనా, శ్రీనివాస్రెడ్డి, ఐటీ మేనేజర్ రమేశ్, ఆర్వోలు, ఆర్ఐలు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
మహిళలు అన్ని రంగాల్లో రాణించి, అభివృద్ధి పథంలో నడిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో అలంకార్ జంక్షన్లోని టీఎన్జీవో భవన్లో శనివారం జరిగిన కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగినులకు ఆటలు, పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేయర్ సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆకుల రాజేందర్ మాట్లాడుతూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఏటా మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న జరుగునున్న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, కేంద్ర సంఘం నాయకులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, రాము నాయక్, జిల్లా నాయకులు సలీం, రాజ్యలక్ష్మి, జయంతి, పావని, సరస్వతి, లక్ష్మీప్రసాద్, రాజేశ్ ఖన్నా, అనూప్, ప్రణయ్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.