Mirchi Cultivation | నర్సింహులపేట, డిసెంబర్ 10 : తుఫాను ప్రభావంతో వాతావరణంలో కలుగుతున్న మార్పులు మిరప పంటపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం నుంచీ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో మొక్కల్లో పెరుగుదల నిలిచిపోతున్నది. మొదట్లో ఏపుగా పెరిగాయని అనందపడ్డ రైతులు, కాయదశలో చెట్టుకొమ్మలు పూర్తిగా ఎండిపోయి కాయలు చేతికొచ్చే అవకాశం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించలేదని, ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఎకరం మిరప పంట సాగుకు రూ.30వేల దాకా ఖర్చు వస్తుండగా పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరపలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర, పేనుబంక, నల్లి ఉధృతి పెరుగుతున్నది.
ఈ తెగులుతో మిరప మొక్క మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది. ఆకులపై నలటి మచ్చలు ఎర్పడి పండుబారి రాలిపోతుంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పిఫ్రోనిల్ 2గ్రాములు లేదా థయోమితాకానిమ్ 0.2 గ్రాములు లేదా క్లోరోఫినాఫైర్ 2గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు ముడత పడి పసుపు వర్ణంలోకి మారి గిడసబారి పోతాయి. మొక్కల్లో ఆకుల మధ్య కణుపుల దూరం తగ్గి ముడుచుకుంటాయి. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు ట్రయజోఫాస్ అనే మందు 1.25 ఎంఎల్ను లీటర్ నీటిలో లేదా ఎసిటామాఫ్రైడ్ 2 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మిరప మొక్కల ఆకుల పాలిపోయి లేత ఆకుపచ్చ రంగుకు మారుతాయి. ఆకులు సన్నబడి పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. ఈ తెగులు పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. దీని వివారణకు ఎసిఫెట్ రెండు గ్రాములు లేదా ఫ్రైడ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి.
గట్టపై కలుపు లేకుండా చూసుకోవాలి. పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు తప్పనిసరిగా గట్టపై మందు పిచికారీ చేసుకోవాలి. వైరస్ ఎక్కువ సోకితే ఆ మొక్కలను పీకి దూరంగా తగలబెట్టాలి. పురుగు మందులు వాడేటప్పుడు తప్పని సరిగా పురుగుమందుతో పాటు వేప సంబంధిత కషాయం లేదా నూనెల మిశ్రమాన్ని కలిపి వాడడం వల్ల సమర్థవంతగా నివారించవచ్చు.