హనుమకొండ, మే 30: సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కార్మికుల హక్కులను కాలరాస్తోంది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకే కొమ్ముకాస్తున్నది. దీంతో తమకు తీరని అన్యాయం జరుగుతున్నదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వరంగ సంస్థల (ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ)ను నిర్వీర్యం చేసి అమ్ముకోవడం, అదానీ, అంబానీ కంపెనీలు నిర్ణయించిన ధరలకే వ్యవస్థలను కట్టబెడుతుండడంపై ఆగ్రహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాంగానికి కేంద్రం తూట్లు
భారత రాజ్యాంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ కార్మికుల హక్కులను చట్టాల సవరణ పేరుతో హరిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 29 చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కొత్త కోడ్లు తీసుకువచ్చిందని, వీటితో తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, సమాజిక భద్రతకోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాలపై కోడ్ రూల్స్ 2021తో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. కనీస వేతన చట్టం సవరణ చేయకుండా, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా, కనీస పనిగంటలు అమలు చేయకుండా, కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతను కాపాడకుండా ఉత్పత్తి, సేవా రంగాల్లో పనిచేస్తున్న వివిధ ఉద్యోగ, కార్మికులను వంచిస్తూ దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడేలా బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. భారత రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, పోస్టల్, ఎయిర్వేస్, ఓడరేవులు, ట్రాన్స్కో, జెన్కో, ఉక్కు వంటి ప్రభుత్వ రంగసంస్థలను అమ్మితే లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదముందని వాపోతున్నారు. కేవలం మత విద్వేషాలతో బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని, దేశ ప్రజల, కార్మికుల సంక్షేమం పట్టని బీజేపీ సర్కారు తీరును ఎండగడతూ తమ హక్కులను పరిరక్షించుకునేందుకే పోరాటాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఉద్యోగ, కార్మిక సంక్షేమానికి తెలంగాణ సర్కారు కృషి
దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు, సౌకర్యాలు కల్పించడంతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ అత్యధిక గౌరవ వేతనాలు ఇస్తున్నది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటున్నది. చేతి, కులవృత్తులవారికి చేయూతనందిస్తూ వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు సౌకర్యాలు కల్పిస్తున్నది. 33 జిల్లాల్లో కార్మిక సంక్షేమ భవనాలు, వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి తోడ్పాటునందిస్తున్నది.
కార్మికుల్లో చైతన్యం కోసం దాస్యం వినూత్న కార్యక్రమాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతోపాటు సంఘటిత, అసంఘటితరంగ కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పిం చి చైతన్యం చేసేందుకు చీఫ్విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ పథకాలను ప్రతి కార్మికుడికి తెలియజేసి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే కార్మికులు, కార్మిక సంఘాల నేతలతో కలిసి మే నెల అంతా కార్మిక, ఉద్యోగ సంక్షేమ మాసోత్సవాన్ని నిర్వహించారు. ముగింపు సందర్భంగా బుధవారం ‘యుద్ధభేరి’ సభ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం భారీ సభ నిర్వహిస్తున్నారు. సభకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరుకానుండగా, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.
కార్మిక సంక్షేమంలో ఆదర్శం
కార్మిక సంక్షేమంలో తెలంగాణకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ కొన్నేళ్లుగా ఏటా మేలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్మిక చైతన్య, సంక్షేమ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్, ఆయన్ను అభినందించడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. కార్మికులు, ఉద్యోగులకే తన జీవితాన్ని అంకితం చేయడంతో పాటు రోజూ కార్మికులకు సమయం కేటాయించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మాసోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్మిక కుటుంబాల స్థితిగతులను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో 12,690 మంది కార్మికులకు సంక్షేమ మండలి ద్వారా గుర్తింపుకార్డులను అందజేశారు.
ఇప్పటివరకు 6,914మందికి సీఎం సహకారంతో రూ.45.71కోట్ల మేరకు లబ్ధిచేకూర్చారు. ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహిస్తూ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేస్తున్నారు. 30ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న వారికి జీవో 58ద్వారా పట్టాలు మంజూరు చేసి గుడిసెవాసుల కలను సాకారం చేశారు. కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ ఐఐటీ, నిట్ వంటి సంస్థలు, విదేశాల్లోనూ చదువుకునేలా తోడ్పాటునందిస్తున్నారు. కార్మికుల్లో మానసికోల్లాసం కోసం క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. కార్మికులతో కార్మికశాఖ మమేకమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కోఆపరేటివ్ సొసైటీలు స్థాపించి కార్మికుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ లబ్ధిపొందేలా చూస్తున్నారు.