బయ్యారం, ఏప్రిల్ 12: తాగునీటి కోసం బయ్యారం మండలం నామాలపాడు ప్రజలు అరిగోస పడుతున్నారు. గ్రామంలో 120 ఇండ్లు ఉండగా, 350 జనాభా ఉంది. కొద్ది రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి భూమి పొరల్లో నిల్వలు ఉన్నాయి. దీంతో బోర్లు వేసినా నీరు సరిగా పడవు. పడినా ఆ నీరు సమరు, చిలుము వాసనతో ఉంటాయి. ఈ నీరు ఱ్పజలు అవసరాలకు ఉపయోగించేలా ఉండవు. దీంతో మిషన్ భగీరథ నీరు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో జిన్నాలవాగు వద్ద బోరు వేసి గ్రామానికి పైపులైన్ ద్వారా నీరు సరఫరా అయ్యేది. ఈ నీటిని ఇన్నాళ్లుగా తాగునీరు, వివిధ అవసరాలకు ఉపయోగించుకునేవారు. కానీ కొద్ది రోజులుగా నీటి సరఫరా సరిగా లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో గ్రామ శివారులోని బోరులో నీటి లభ్యత పూర్తిగా లేదు. ఈ క్రమంలోనే మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదు. దీంతో స్థానికులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఊరు పక్కనున్న వాగుల్లో కొందరు కలుషిత నీటినే తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. మరికొందరు పక్కనున్న కొత్తపేట, గంధంపల్లికి వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది గంధంపల్లి, కొత్తపేట గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తున్నా అవి సరిపోక మహిళలు నీటి కోసం బిందెలు, క్యాన్లతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. సమీప వాగులు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్నానాలు చేసి, అక్కడే ఉతుక్కుంటున్నారు. నీటి కొరత వచ్చినప్పుడు హడావుడిగా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శాశ్వత పరిష్కారాన్ని ఆలోచించడంలేదు. పైగా ఈసారి వేసవి దృష్ట్యా ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుతం తాము నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటిసమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నామాలపాడులో నీటి కటకట పదేళ్ల తర్వాత పునరావృతమైంది. అప్పట్లో నీటి కోసం ఇక్కడి ప్రజలు వాగులు, ఊట చెలిమలు, వ్యవసాయబావుల వద్ద వెళ్లి తెచ్చుకునేవారు. ఈ క్రమంలోనే కలుషిత నీరు తాగి గ్రామానికి చెందిన వృద్ధుడు పోశాలు, యువతి శ్రావణి మృతిచెందింది. దీంతో అప్పటి కలెక్టర్ ప్రీతిమీనా గ్రామాన్ని సందర్శించి నీటి సమస్య పరిష్కారం కోసం రూ.10లక్షల నిధులు కేటాయించి జిన్నాల వాగు వద్ద బోరు వేయించి పైపులైన్ ద్వారా గ్రామానికి నీటిని సరఫరా చేశారు. గ్రామంలో ఆర్వో ప్లాంట్ చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించారు. ఆతర్వాత మిషన్ భగీరథ రావటంతో తాగునీటి, ద్వారా సాధారణ నీరు అందుతున్నాయి. కొన్ని రోజులుగా సరఫరా లేక ప్రజలు దూర ప్రాంతాలకు పోవాల్సిన దుస్థితి నెలకొంది.
తాగునీటి కోసం కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మిషన్ భగీరథ నీరు, బోరు నుంచి నీటి సరఫరా నిలిచి పోయింది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. ఎన్నిసార్లు అధికారులు పట్టించుకోవటం లేదు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. పోయినేడాది నీళ్లు మంచిగనే వచ్చాయి.
మా ఊరి భూమి పొరల్లో మొత్తం బొగ్గే ఉంది. బోరు వేసినా సరిగా నీ రు పడదు. పడ్డా సమరు వాసన పనికిరావు. అందుకే శివారు లో బోరు వేసి పైపులైన్లతో గ్రామాని కి పదేండ్లుగా నీటిని అందిస్తున్నారు. ఇప్పుడు బోరులో నీరు ఎండిపోయింది. కొద్ది రోజులుగా మస్తు తిప్పలు పడుతున్నం. ముందు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో!