వర్ధన్నపేట, జూన్ 15 : రైతులు కొంతమంది అవగాహనలేమితో పొలాల్లోని వరి కొయ్యలను కాల్చుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత యాసంగిలో వరి పంటలు పూర్తికావడంతో రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యాసంగిలో వరి పంటలను కోయించిన రైతులు కొయ్యలు, మిషన్ కోసిన వరి గడ్డి ఉండడంతో కాల్చుతున్నారు. గడ్డి, కొయ్యలు ఎండిపోవడంతో ఒకచోట మంట ప్రారంభమైతే దాని చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల్లోని పంట భూములకు మంటలు విస్తరిస్తున్నాయి. ఎండలకు తోడు గాలివీస్తుండడంతో మంటలు క్షణాల్లో వ్యాపిస్తున్నాయి. పొలాల్లోని విద్యుత్ మోటర్లు, స్టార్టర్లు, వైర్లు, పీవీసీ పైపులు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇటీవల వర్ధన్నపేట మండల పరిధిలోని కడారిగూడెం గ్రామ శివారులో రైతు వరి కొయ్యలకు మంటలు పెట్టడంతో పొలాలు మొత్తం వ్యాపించి పైపులు, స్టార్టర్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే బుధవారం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిలోని ఇల్లంద శివారు చెరువు కింద పొలాల్లో రైతులు పొలాల్లో మంటలు పెట్టడంతో అవి వ్యాపించి జాతీయ రహదారిపై దట్టంగా పొగ అలుముకున్నది. అంతేకాక పొలాల్లోని పలువురు రైతులకు సంబంధించిన పైపులు కాలిపోవడంతో రైతులు నష్టపోయారు. కొయ్యలకు నిప్పు పెట్టవద్దని వ్యవసాయశాఖ అధికారులు చెప్పినా రైతులు పట్టించుకోవడం లేదు. కొయ్యలను కాల్చకుండా పొలాన్ని దమ్ము చేసే సమయంలో వేస్ట్ డీ కంపోసర్ చల్లుకుంటే పొలంలోనే కొయ్యలు మురిగిపోయి పొలం సారవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు ఇప్పటికైనా కొయ్యలను కాల్చొద్దని వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు.