కాశీబుగ్గ, మార్చి 30: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం దేశీరకం పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధర తులం దాదాపు రూ.50వేలు ఉండగా, మిర్చి క్వింటాల్ ధర అంతకంటే ఎక్కువ పలికింది. పంటల దిగుబడి తగ్గినా ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా అదే మండలంలోని ఎస్ నగర్ గ్రామానికి చెందిన రైతు బలుగూరి రాజేశ్వర్రావు ఏడు బస్తాల దేశీరకం మిర్చిని తీసుకువచ్చారు. హనుమాన్ ఎంటర్ప్రైజెస్ అడ్తి ద్వారా లాల ట్రేడింగ్ చిల్లీస్ ఖరీదు వ్యాపారి అత్యధికంగా క్వింటాల్కు రూ.52వేల ధరకు కొనుగోలు చేశారు.
ఇక జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు ఎ.కుమారస్వామి బస్తాల పత్తిని తీసుకువచ్చారు. నవజ్యోతి ట్రేడింగ్ కంపెనీ అడ్తి ద్వారా గణపతిసాయి ట్రేడర్స్ కాటన్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.11వేల 690కు కొనుగోలు చేశారు. నాణ్యమైన సరుకు తీసుకువచ్చి రికార్డు స్థాయిలో ధర పొందిన ఆయా రైతులను మార్కెట్ సిబ్బంది అభినందించారు. మిర్చి రైతు రాజేశ్వర్రావుకు మార్కెట్ ప్రధాన కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ శాలువాతో సన్మానం చేశారు.