వరంగల్చౌరస్తా, ఫిబ్రవరి 23: వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో వైద్యం మాట దేవుడెరుగు.. కనీసం తాగునీటికి సైతం రోగులు, అటెండెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో దాహం తీర్చుకోవడానికి తాగునీరు కరువైంది. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంజీఎంహెచ్ సేవలు వినియోగించుకునేందుకు వచ్చే నిరుపేదలకు కనీసం తాగు నీరు అందించలేకపోతున్నారు. కాగా, దాతలు అందించిన రెండు వాటర్ కూలర్లను గతంలో అత్యసవర విభాగం ఎదుట, ఓపీ విభాగం పక్కన ఏర్పాటు చేశారు. దాంతో పారిశుధ్య చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన అధికారులు వాటిల్లో ఒకదాన్ని ఏఎంసీ వార్డుకు వెళ్లే దారిలో, మరో వాటర్ కూలర్ను ఓపీ విభాగంలోని ఆర్థో క్యాబిన్ ఎదుట శాశ్వత గద్దెవంటి నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకొన్నారు.
కానీ వాటికి నీటి సరఫరా లేకపోవడం, మరమ్మతులు, నిర్వహణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. అదేవిధంగా శాశ్వత నిర్మాణాల్లో భాగంగా ఎంజీఎంహెచ్లో రోగులకు అందించే డైట్ తయారీ విభాగం(వంటగది) వద్ద ఉన్న తాగునీటి ఏర్పాటు గది నిర్వహణలో లేకపోవడంతో తాత్కాలికంగా తలుపులు భింగించి ఉంచారు. దాంతో రోగులకు తాగు నీటి కష్టాలు తప్పడంలేదు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రెండు వాటర్ ప్లాంట్లు సేవలు అందిస్తున్నా, నగదు చెల్లింపుల ద్వారా మాత్రమే తాగు నీరు అందుబాటులో ఉంటున్నది. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాల రోగులకు తాగునీటి కష్టాలు నెలకొన్నాయి.
ముందస్తు చర్యలు శూన్యం
వేసవిని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ముందస్తు చర్యలపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతున్నా అధికారులు తాగునీటి వసతులపై దృష్టి సారించకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. గతంలో అత్యవసర విభాగం ఎదుట తాగునీటి వసతి కల్పించడంతో చాలా ఉపయోగకరంగా ఉండేదని, అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగితోపాటుగా అటెండెంట్లకు తాగునీటి వసతి ప్రత్యక్షంగా కనిపించే విధంగా ఉండేదని, ఇప్పుడు అక్కడి నుంచి ఏఎంసీ వార్డు దారిలోకి మార్చడంతో తాగునీటి సమస్య ఏర్పడిందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు, అటెండెంట్లు కోరుతున్నారు.