తాడ్వాయి, ఏప్రిల్ 5 : మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులకు గద్దెల వద్ద తాగునీటి సౌకర్యంతోపాటు కాళ్లు కాలకుండా కార్పెట్లను ఏర్పాటు చేశారు. మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 4న నమస్తే తెలంగాణలో ‘మండుతున్న ఎండలు..
పరిగెడుతున్న భక్తులు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన మేడారం జాతర కార్యనిర్వాహక అధికారి వీరస్వామి ఆదివారం గద్దెల ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారం నుంచి గద్దెల వరకు భక్తుల కాళ్లు కాలకుండా కార్పెట్లు వేయించారు. భక్తుల దాహం తీర్చేందుకు సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద, సారలమ్మ ఎగ్జిట్ గేట్ వద్ద తాగునీటి సౌకర్యం కల్పించారు.