నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయపర్తిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వేర్వేరుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నివాళులర్పించారు. పట్టణంలో అంబేద్కర్ 10 అడుగుల కాంస్య విగ్రహం నిర్మాణం కోసం గతంలో నిధులు కేటాయించామని, విగ్రహం ఏర్పాటుకు అందరూ కృషి చేయాలని కోరారు. అలాగే, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతేకాకుండా పెద్ది సుదర్శన్రెడ్డి నల్లబెల్లిలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఖానాపురంలోని ఎస్సీ కాలనీ అంబేద్కర్ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బత్తిని శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. వరంగల్ కాశీబుగ్గ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ ఆశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాల వేసి నివాళలర్పించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ నివాళులర్పించారు.
ఇల్లందలో అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు వేడుకల్లో పాల్గొన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, పీఆర్వో అయూబ్ అలీ, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఈఈ సంజయ్కుమార్, బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరీ శంకర్ పాల్గొన్నారు. హనుమకొండ అంబేద్కర్ సెంటర్లోని విగ్రహానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ అంబర్ కిశోర్ ఝా, జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారపెల్లి సుధీర్కుమార్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి నిర్మల తదితరులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాసర్ పాల్గొని నివాళులర్పించారు. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, డైరెక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొని దివ్యాంగ విద్యార్థులకు ఆర్థికసాయం అందజేశారు. కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అంబేదర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంజీఎం దవాఖాన నుంచి హనుమకొండలోని అంబేదర్ సెంటర్ వరకు జరిగిన భీమ్ జ్ఞాన విజయ యాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అంబేద్కర్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ధర్మసాగర్లో నిర్వహించిన కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శాయంపేటలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాశీబుగ్గ : కాశీబుగ్గ చౌరస్తాలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ జయంతిలో మంత్రి కొండా సురేఖ పాల్గొనకపోవడం దళితులపై కాంగ్రెస్ చిన్నచూపునకు నిదర్శనమని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోలెపాక మార్టిన్ లూథర్ ఆరోపించారు. కాశీబుగ్గ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించి మాట్లాడారు.
ఐనవోలు: మండలకేంద్రంలో అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలు పాత నాయకులు ఒక వర్గం, పార్టీలో కొత్తగా చేరిన నాయకులు మరో వర్గంగా వచ్చి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి రోజే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడడంతో కార్యకర్తలు ఏ నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొనాలో తెలియక సతమతమయ్యారు.